మోడీకి శశికళ మార్క్ 'దెబ్బ', పన్నీరుతో అక్కడే బెడిసి కొట్టింది
జయలలిత మృతి చెందిన అనంతరం తమిళనాడులో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు అందరూ ఊహించిందే జరిగింది. శశికళ అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నికయ్యారు.
చెన్నై: గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో జయలలిత మృతి చెందిన అనంతరం తమిళనాడులో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు అందరూ ఊహించిందే జరిగింది. శశికళ అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నికయ్యారు.
దటీజ్ చిన్నమ్మ: ఉచ్చు బిగిద్దామనుకుంటే.. శశికళ ముందు బీజేపీ, పన్నీరు చిత్తు
ఆదివారం నాడు ఆమెను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకుంటారని, ఆ తర్వాత సీఎం అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిని ఓ వర్గం కొట్టి పారేసింది. అయితే, సీఎం పీఠం పైన కన్నేసిన శశికళ.. చివరకు అందులో విజయం సాధించారు.
శశికళ వ్యూహాల ముందు తేలిపోయాయి
ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, పన్నీరు సెల్వం చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేసినా, రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను, అన్నాడీఎంకేలోని విభేదాలను బీజేపీ సొమ్ము చేసుకోవాలని చూసినా.. అన్నీ శశికళ వ్యూహాల ముందు తేలిపోయాయి.
ప్లాన్గా ముందుకు కదిలిన శశికళ
దాదాపు ఇటీవలి కాలంలో.. ముఖ్యమంత్రి పీఠం పైన ఇంత సస్పెన్స్ కొనసాగింది తమిళనాడు విషయంలోనే. ముఖ్యమంత్రి పీఠం అటు ఇటు కదిలి.. చివరకు చిన్నమ్మ చేతికే వచ్చింది. దీనిని దక్కించుకునేందుకు శశికళ వ్యూహాత్మకంగా పావులు కదిపారని అంటున్నారు.
తేలిపోయిన పన్నీరు సెల్వం
పన్నీరు సెల్వం తాను ముఖ్యమంత్రిని అనే విషయాన్ని బలంగా జనంలోకి, పార్టీ క్యాడర్లోకి తీసుకు వెళ్లలేకపోయారు. పన్నీరు పేరుకే ముఖ్యమంత్రి అని.. తెరవెనుక అంతా చిన్నమ్మ పావులు కదుపుతోందనే ప్రచారం జరిగింది. నిన్నటికి నిన్న ముగ్గురు ముఖ్య అధికారులు తప్పుకోవడం కూడా శశికళ వ్యూహంలో భాగమే.
పన్నీరు సెల్వం
పన్నీరు సెల్వం విషయంలో పలు రకాల వాదనలు ఉన్నాయి. ఆయనను పావుగా వినియోగించుకొని బీజేపీ ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోందనే వాదన ఉంది. అలాగే, శశికళ కనుసన్నుల్లోనే పన్నీరు సీఎంగా బాధ్యతలు స్వీకరించినందున... ఆయన ఆమె సూచనల ప్రకారమే నడుచుకున్నారని మరో వాదన కూడా ఉంది.
పన్నీరుకు అదే బెడిసి కొట్టిందా.. మరో వాదన
పన్నీరు సెల్వం ద్వారా బీజేపీ తమిళనాడులో పావులు కదుపుతున్నట్లుగా అంతటా ప్రచారం జరిగింది. జయలలిత ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కేంద్రం వద్దకు వెళ్లలేదు. అయితే, పన్నీరు సెల్వం మాత్రం రెండుమూడుసార్లు ఢిల్లీ వెళ్లి విజ్ఞాపనలు ఇచ్చారు. పన్నీరు సెల్వం చేసిన ఆ పని తమిళ ప్రజలకు రుచించలేదని, దీనిని శశికళ తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారనే వాదనలు ఉన్నాయి
జల్లికట్టు.. శశికళ మార్క్
బీజేపీకి చెక్ చెప్పేందుకు శశికళ జల్లికట్టును ఉపయోగించుకున్నారనే వాదనలు ఉన్నాయి. జల్లికట్టులో విధ్వంసం వెనుక శశికళ ఉన్నారనే ఆరోపణల ఉన్నాయి. పన్నీరు ఒకటికి రెండుసార్లు ఢిల్లీకి వెళ్లడం, కేంద్రానికి వ్యతిరేకంగా జల్లికట్టు రగడ... వీటితో బీజేపీకి చెక్ చెప్పారని అంటున్నారు. అయితే, శశికళ ఇదంతా ఎలాంటి గందరగోళం లేకుండా తన మార్క్ రాజకీయంతో చాపకింద నీరులా చేసుకుపోయారని అంటున్నారు.
తమిళనాడుపై బీజేపీ ఆశలు
జయలలిత మృతి అనంతరం తమిళనాడు పైన బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. తొలుత శశికళ, పన్నీరు సెల్వంలతో చక్రం తిప్పాలనుకుంది. జయలలిత మృతి తర్వాత తమిళనాట తమకు అవకాశాలున్నాయని స్వయంగా వెంకయ్య చెప్పారు. కానీ తమిళనాట జాతీయ రాజకీయ పార్టీలకు అంత సీన్ లేదు. దీనినే గుర్తించిన శశికళ.. తన చతురతతో ఇటు పార్టీలో, అటు బీజేపీని ధీటుగా ఎదుర్కొని తొలుత పార్టీ అధినేత్రిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.