పన్నీర్, పళని గ్రూప్ ల విలీనానికి రెఢీ, శశికళకు చెక్, కారణమిదే!
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. అన్నాడీఎంకెలోని పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపులు కలిసిపోయేందుకు మార్గం సుగమమైంది
చెన్నై:తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. అన్నాడీఎంకెలోని పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపులు కలిసిపోయేందుకు మార్గం సుగమమైంది.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత అన్నాడీఎంకెలో సంక్షోభం నెలకొంది.అయితే అన్నాడీఎంకెలో పట్టు సాధించిన శశికళ అక్రమాస్తుల కేసులో పరప్పర ఆగ్రహార జైలుకు వెళ్ళడంతో పార్టీ మరింత ఇబ్బందులను ఎదుర్కొంది.
శశికళ కారణంగానే పార్టీలో సంక్షోభం నెలకొందనే భావన కూడ లేకపోలేదు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. శశికళ ముఖ్యమంత్రి కాకుండా పన్నీర్ సెల్వం గ్రూపు నిలువరించింది.
అయితే ఆర్ కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు రెండు గ్రూపులు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.అయితే ఈ ఉప ఎన్నికల్లో విపరీతంగా డబ్బును వెదజల్లారనే కారణంగా ఈ ఉప ఎన్నికను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకొంది.అంతేకాదు పార్టీ ఎన్నికల గుర్తు కోసం దినకరన్ లంచం ఇవ్వజూపారనే కేసు కూడ తాజాగా నమోదైంది.దీంతో పార్టీని రక్షించుకొనేందుకుగాను ఈ రెండు గ్రూపులు విలీనం కావాలనే చర్చలను ప్రారంభించాయి.
పళనిస్వామి, పన్నీర్ గ్రూపుల విలీనానికి రంగం సిద్దం
తమిళనాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గ్రూపులు ఏకమయ్యేందుకు రంగం సిద్దమైంది. పార్టీని కాపాడుకొనేందుకుగాను ఈ రెండు గ్రూపులు విలీనం కావాలని నిర్ణయానికి వచ్చాయి.ఈ మేరకు రెండు రోజులుగా పళనిస్వామి గ్రూపుకు చెందిన నాయకులు పన్నీర్ సెల్వంతో చర్చలను ప్రారంభించారు.
ఈ చర్చల్లో శశికళ కుటుంబాన్ని పార్టీ నుండి బయటకు పంపాలని పన్నీర్ డిమాండ్ చేశాడు. జయలలిత మృతిపై విచారణ జరిపించాలని కోరాడు. ఈ షరతులకు పళనిస్వామి వర్గం అంగీకారం తెలిపింది. మంగళవారం నాడు పళనిస్వామి వర్గానికి చెందిన సీనియర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ నుండి శశికళను తప్పించాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం చేస్తున్నట్టు ప్రకటించారు.దీంతో పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపులు కలిసిపోనున్నాయి.
ఈ రెండు గ్రూపుల మధ్య సయోధ్య ఎలా కుదిరిందంటే?
ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వజూపారనే కేసు అన్నాడీఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ పై నమోదైంది. అన్నాడీఎంకె లో తిరిగి ఏకమయ్యేందుకు శశికళ వర్గానికి చెందిన నాయకులు ముందుకు వస్తే తాను స్వాగతిస్తానని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు.
ఈ ప్రకటనతో లోక్ సభ డిఫ్యూటీ స్పీకర్ తంబిదురై సచివాలయంలో రెండు దఫాలు ముఖ్యమంత్రి పళనిస్వామితో చర్చించారు.పన్నీర్ సెల్వం ప్రకటనను తాను స్వాగతిస్తున్నట్టు ప్రకటించారు.
చర్చలకు తెరతీసిన పళనిస్వామి గ్రూప్
ఈ మేరకు పన్నీర్ సెల్వం గ్రూపుతో ముఖ్యమంత్రి పళనిస్వామి గ్రూపు చర్చలను జరిపింది. పలు దఫాలు పన్నీర్ తో వారు చర్చించారు.సుదీర్ఘంగా చర్చించారు. సుమారు9 మంది సభ్యుల కమిటీ ఈ మేరకు పన్నీర్ తో చర్చించింది.
ఈ చర్చల సారాంశాన్ని టీటీవి దినకరన్ కు చెప్పారు.అయితే దినకరన్ మాత్రం ఈ చర్చల విషయమై కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు.అయితే పార్టీ అవసరాల రీత్యా చర్చలు అవసరమనే అభిప్రాయాన్ని పార్టీ నాయకులు గుర్తు చేశారు. దినకరన్ ను పార్టీ పదవి నుండి తప్పుకోవాలని హెచ్చరించారు.కానీ, ఆయన వినలేదు. చివరకు పార్టీ నుండి శశికళ కుటుంబాన్ని తప్పిస్తూ పళనిస్వామి గ్రూప్ నిర్ణయం తీసుకొంది.
పంతం నెగ్గించుకొన్న పన్నీర్ సెల్వం
జయలలిత బతికున్న సమయంలో పార్టీకి దూరంగా ఉంచినవారందరినీ తిరిగి పార్టీకి దూరంగా ఉంచాలని పన్నీర్ సెల్వం పట్టుబట్టారు.ఈ మేరకు మన్నార్ గుడి మాఫియాను పార్టీకి దూరంగా ఉంచాలని అన్నాడీఎంకె ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొంది.
మరోవైపు శశికళ, దినకరన్ ల వ్యవహరశైలితో పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.ఆర్ కె నగర్ ఉప ఎన్నిక రద్దుతో పార్టీకి కష్టాలు ప్రారంభమయ్యాయి.దీంతో నష్టనివారణ చర్యలను ప్రారంభించాలని భావించిన పళనిస్వామి వర్గం పన్నీర్ సెల్వంతో రాజీకి సై అంది.
పార్టీలో, ప్రభుత్వంలో శశికళ కుటుంబం ప్రమేయముండదు
ఈ రెండు వర్గాల విలీనంలో భాగంగా శశికళ కుటుంబాన్ని పార్టీ నుండి తప్పించాలని పన్నీర్ వర్గం పై చేయి సాధించాడు. ఈ మేరకు పార్టీలో, ప్రభుత్వంలో గాని శశికళ కుటుంబం ప్రమేయం ఉండదని అన్నాడీఎంకె నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు పార్టీకి చెందిన 122 మంది ఎమ్మెల్యేలు కూడ ఈ నిర్ణయాన్ని సమర్థించారు.
శశికళకు ఊహించని షాక్
ఆర్ కె నగర్ ఉప ఎన్నిక రద్దుతో పాటు ఢిల్లీలో దినకరన్ పై లంచం ఇవ్వజూపారనే కేసు నమోదు కావడంతో శశికళ కుటుంబాన్ని తప్పించాలని పళనిస్వామి వర్గం గ్రూప్ భావించింది.ఇదే సమయంలో పన్నీర్ సెల్వం గ్రూప్ నుండి విలీన ప్రతిపాదనలు వచ్చాయి.ఈ ప్రతిపాదనల ఆధారంగా శశికళ కుటుంబాన్ని పార్టీ నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు.జైలులో ఉన్న శశికళకు ఈ పరిణామం ఊహించని షాక్ తగిలినట్టైంది.