హై కోర్టును ఆశ్రయించిన శశికళ, టీటీవీ: పళని, పన్నీర్ సెల్వంకు నోటీసులు, బ్యాంకు అకౌంట్స్ !
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ, టీటీవీ దినకరన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి మమ్మల్ని బలవంతంగా బహిష్కరించారని,
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ, టీటీవీ దినకరన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి మమ్మల్ని బలవంతంగా బహిష్కరించారని, పార్టీ బ్యాంకు అకౌంట్స్ లోని నగదు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తమ పదవులు రద్దు చెయ్యరాదని, పార్టీ బ్యాంకు అకౌంట్స్ వివరాలు సేకరించి నగదు దుర్వినియోగం కాకుండా చూడాలని మనవి చేస్తూ శశికళ, టీటీవీ దినకరన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి సీవీ. కార్తికేయన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు నోటీసులు జారీ చేశారు.
పన్నీర్ సెల్వం, పళనిసామితో పాటు పార్టీ సీనియర్ నాయకులు మధుసూదనన్, ఎస్. సెమ్మలై, మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ కు న్యాయమూర్తి కార్తికేయన్ నోటీసులు జారీ చేసి నవంబర్ 29వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని సూచించారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
పార్టీ కార్యాలయం మేనేజర్ మహాలింగం నవంబర్ 10వ తేదీన బ్యాంకు అకౌంట్స్ లావాదేవీలు మొత్తం కోర్టు ముందు సమర్పించాలని సూచించారు. శశికళ, టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సెప్టెంబర్ 12వ తేదీన పార్టీ నాయకులు, కార్యవర్గ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
అప్పటి నుంచి అన్నాడీఎంకే పార్టీ కోఆర్గినేటర్ గా పన్నీర్ సెల్వం, జాయింట్ కోఆర్డినేటర్ గా ఎడప్పాడి పళనిసామి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శాశ్వతంగా రద్దు చేస్తూ పార్టీ నాయకులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది. అన్నాడీఎంకే పార్టీకి కరూర్ వైశ్యా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్స్ ఉన్నాయి.