శశికళ ఫ్యామిలీ కొత్త పార్టీ ! మన్నార్ గుడి మాఫియా భారీ స్కెచ్: రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు!
శశికళకు ఫ్యామిలీకి చెందిన మన్నార్ గుడి మాఫియా సభ్యులు రహస్యంగా సమావేశమై మనం రాజకీయంగా ముందుకు వెళ్లాలంటే కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని చర్చలు జరిపారని వెలుగు చూసింది.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో చక్రం తిప్పాలని, తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న శశికళ నాటరాజన్ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. శశికళ జైల్లో ఉన్నా తమిళనాడు రాజకీయాలను శాసించాలని ఆమె కుటుంబ సభ్యులు ఆశపడ్డారు.
పోయెస్ గార్డెన్ లో జయలలిత ఆత్మ: రాత్రి శభ్దాలు, అరుపులు: శశికళ ఫ్యామిలీ ఔట్!
అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎత్తులు పైఎత్తులకు మన్నార్ గుడి మాఫియాకు చుక్కలు కనపడుతున్నాయి. శశికళ వారసుడిగా అన్నాడీఎంకే పార్టీ (అమ్మ శిభిరం) ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన టీటీవీ దినకరన్ సైతం తీహార జైలుకు వెళ్లడంతో ఇప్పుడు ఈ విషయాల్ని మన్నార్ గుడి ముఠా సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
రహస్యంగా సమావేశం
మన్నార్ గుడి మాఫియా సభ్యులు రహస్యంగా సమావేశం అయ్యారు. రాజకీయంగా మనం ఎలా ముందుకు వెళ్లాలి అంటూ బుధవారం చర్చించారని వెలుగు చూసింది. అన్నాడీఎంకే పార్టీ నుంచి దూరం అయితే మనం ఏం చెయ్యాలి అని సుదీర్ఘంగా చర్చించారని తెలిసింది.
సీఎం ఎడప్పాడి పళనిసామి
ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలిసిపోయి అన్నాడీఎంకేలోని రెండు శిభిరాలు విలీనం చెయ్యాలని చర్చలు జరిగాయి. అయితే పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్లతో విలీనం చర్చలు రోజురోజుకు వెనక్కి వెలుతున్నాయి.
శశికళ ఫోటో, ఫ్లెక్సీలు చెత్త కుప్పలో
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన శశికళ ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఫోటోలు తొలగించి చెత్తకుప్పలో వెయ్యడాన్ని మన్నార్ గుడి మాఫియా సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్బంలో శశికళ హవా ఏలా కొనసాగించాలని మన్నార్ గుడి మాఫియా ఆలోచిస్తోందని వెలుగు చూసింది.
ఎమ్మెల్యేలలో చీలిక ?
శశికళ ఆశిస్సులతోనే ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలను మనవైపు తిప్పుకుని తమిళనాడు రాజకీయాలను శాసించాలని, తమిళనాడులో మనదే రాజ్యం ఉండాలని మన్నార్ గుడి మాఫియా ప్లాన్ వేస్తున్నదని సమాచారం.
నిధులతో సమస్యలేదు
జయలలితను అడ్డం పెట్టుకుని ఆమెకు తెలీకుండా చాపకింద నీరులా శశికళ భారీ మొత్తంలో ఆస్తులు సంపాధించారని ఆరోపణలు ఉన్నాయి. శశికళ బినామీలుగా మన్నార్ గుడి మాఫియా సభ్యులు ఉన్నారని ఏన్నో ఏళ్ల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. కొత్త పార్టీ పెట్టినా వీరికి నిధుల కొరతలేదని సమాచారం.
టీటీవీ దినకరన్ పేరుతో
ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎర వేసిన కేసులో అరెస్టు అయ్యి తీహార్ జైల్లో ఉన్న టీటీవీ దినకరన్ ఇప్పుడు మన్నార్ గుడి మాఫియాలో లీడర్ అయ్యాడు. టీటీవీ దినకరన్ పేరవై పేరుతో బుదవారం రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు, పోస్టర్లు తమిళనాడులో దర్శనం ఇచ్చాయి.
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
శశికళ, ఆమె కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారని, వారి కారణంగానే జయలలితకు చెడ్డపేరు వచ్చిందని ప్రజలు భావిస్తున్నారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యుల పేర్లు ఎత్తితే అన్నాడీఎంకే పార్టీలోని ఓ వర్గం కార్యకర్తలు మండిపడుతున్నారు.
ప్రజలే బుద్ది చెబుతుారు
ఇలాంటి సమయంలో కొత్త పార్టీ అంటూ మన్నార్ గుడి మాఫియా తెరమీదకు వస్తే ప్రజలు ఆదరిస్తారా ? అనే ప్రశ్న మొదలైయ్యింది. డబ్బుతో అన్నీ చెయ్యాలని భావిస్తున్న శశికళ కుటుంబ సభ్యులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అజ్ఞాత నాయకులు ఎవరు ?
టీటీవీ దినకరన్ పేరవై పేరుతో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేసిన ఆ అజ్ఞాత నాయకులు ఎవరు ? అంటూ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. అసలు టీటీవీ దినకరన్ కు అంత సీన్ ఉందా ? అనే విషయం ఇప్పుడు చర్చమొదలైయ్యింది. మొత్తం మీద శశికళ కుటుంబ సభ్యులు కొత్త పార్టీ పెడుతున్నారని తమిళనాడులో జోరుగా ప్రచారం జరుగుతోంది.