పది రోజుల్లో శశికళ విడుదల- 129 రోజుల శిక్షాకాలం తగ్గింపు- 10 కోట్ల జరిమానాతో...
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి బెంగళూరు పరప్పన ఆగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు రాజకీయ నేత, మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ త్వరలో విడుదల కానున్నారు. అక్రమాస్తుల కేసులో ఆమెపై ఆరోపణలు నిర్దారణ కావడంతో నాలుగేళ్లుగా ఆమె ఇదే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 21 నాటికి ఆమె శిక్షాకాలం పూర్తి కానుంది. కానీ సత్ప్రవర్తన, ఇతర కారణాల ఆధారంగా ఆమెను 129 రోజుల ముందే జైలు నుంచి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
తాను పది రోజుల్లో బెంగళూరు జైలు నుంచి విడుదల కాబోతున్నానని, తన కోసం పది కోట్ల 10 వేల రూపాయల జరిమానా మొత్తాన్ని సిద్ధం చేయాలని పేర్కొంటూ తన న్యాయవాది చెందూర్ పాండియన్కు శశికళ తాజాగా ఓ లేఖ రాశారు. ఇప్పటికే 43 నెలలుగా జైలు జీవితం గడిపిన శశికళ విడుదలయ్యేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు న్యాయవాది పాండియన్ వెల్లడించారు. ప్రస్తుతం కర్నాటకలో దసరా సెలవుల కారణంగా కోర్టులకు సెలవులు ఉన్నందున ఈ నెల 26న కోర్టులు తిరిగి ప్రారంభం కాగానే, దీనిపై ఓ నిర్ణయం వెలువడనుందని న్యాయవాది తెలిపారు.
కర్నాటక ప్రభుత్వ నిబంధనల ప్రకారం జైల్లో శిక్ష అనుభవించే ఖైదీలకు సత్ప్రవర్తన కారణంగా నెలలో మూడు రోజుల పాటు శిక్షాకాలం తగ్గుతుంది. ఈ లెక్కన శశికళకు 129 రోజుల శిక్షాకాలం తగ్గించి ముందే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జైలు నుంచి విడుదల కాగానే తమిళనాడు రాజకీయాల్లో తిరిగి చక్రం తిప్పేందుకు శశికళ సిద్ధమవుతున్నారు. మేనల్లుడు దినకరన్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీకి కూడా శశికళ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.