11 మంది పన్నీర్ వైపుకు వస్తే శశికళకు చెక్, పావులు కదుపుతున్న సెల్వం
అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ వర్గం నుండి రోజు రోజుకు ఎంఏల్ఏల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరో 11 మంది ఎంఏల్ఏలు ఆమె శిభిరం నుండి బయటకు వస్తే ఆమె ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం మరింత సన్నగిల్లే అవకాశ
చెన్నై:అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ వర్గం నుండి రోజు రోజుకు ఎంఏల్ఏల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరో 11 మంది ఎంఏల్ఏలు ఆమె శిభిరం నుండి బయటకు వస్తే ఆమె ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం మరింత సన్నగిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. సెల్వానికి ఇప్పటికే పదిమంది ఎంపిలు తమ మద్దతును ప్రకటించారు.ఇప్పటికే ఆయనకు ఏడుగురు ఎంఏల్ఏలు మద్దతుగా నిలిచారు. స్వయంగా ఆయన ఇంటి వద్దకు వచ్చి ఏడుగురు ఎంఏల్ఏలు కలిశారు.
పన్నీర్ సెల్వానికి మద్దతుగా నిలిచే ఎంఏల్ఏల సంఖ్య 18కి పెరిగిే శశికళ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఆదివారం నాడే ఐదుగురు ఎంపిలు ఆయనను కలిసి తమ మద్దతును ప్రకటించారు.
రామరాజన్ లాంటి ప్రముఖ నటులు కూడ సెల్వానికి మద్దతు ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీలో స్థానాల సంఖ్య 235.ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 117 ఎంఏల్ఏల మద్దతు ఉండాలి.
శశికళ తనకు 130 మంది ఎంఏల్ఏల బలం ఉందని చెబుతున్నారు. అయితే పన్నీర్ కు ఏడుగురు ఎంఏల్ఏలు డైరెక్ట్ గా ఆయన శిబిరంలోనే ఉంటున్నారు. శశికళ శిభిరంలో ఉన్న మరో 20 మంది ఎంఏల్ఏలు కూడ పన్నీర్ కు అనుకూలంగానే ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రెవిన్యూ అధికారులు విచారణ సాగించిన సమయంలో కొందరు ఎంఏల్ఏలు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు సమాచారం.
అయితే ఇప్పటికే డిఎంకె పన్నీర్ సెల్వానికి తమ మద్దతును ప్రకటించింది. అసెంబ్లీలో డిఎంకె కూటమికి 89 మంది సభ్యుల బలం ఉంది.. అయితే శశికళకు తనకు 130 మంది సభ్యుల బలం ఉందని చెబుతున్నారు.అయితే అందులో నుండి 18 మంది ఎంఏల్ఏలు తగ్గితే ఆమెకు మద్దతిచ్చే ఎంఏల్ఏల సంఖ్య 112 కు పడిపోయే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 117 కు చేరుకోవాలి. అంటే మరో ఐదుగురు ఎంఏల్ఏలు ఆమెకు అవసరమౌతారు. శశికళ వర్గంలో ఉన్న ఎంఏల్ఏలు తన వైపుకు తిప్పుకొనేందుకు పన్నీర్ పావులు కదుపుతున్నారు.