ఓడి గెలిచిన శశికళ: పంతం నెగ్గింది, కానీ ఏం మిగిలింది?
తమిళనాడు రాజకీయాల్లో శశికళ పాత్ర ముగిసినట్లేనని పలువురు పేర్కొంటున్నారు. జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితురాలిగా ఉన్న శశికళను దోషిగా తేల్చుతూ సుప్రీం కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.
చెన్నై: సీఎం జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పన్నీరుసెల్వం రాజీనామా చేయడంతో తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి.. గురువారం శాసనపక్ష నేత పళనిస్వామిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కోరడంతో తెరపడినట్లయింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పనప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
శశికళ రాజకీయం ముగిసినట్లే..
ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాల్లో శశికళ పాత్ర ముగిసినట్లేనని పలువురు పేర్కొంటున్నారు. జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితురాలిగా ఉన్న శశికళను దోషిగా తేల్చుతూ సుప్రీం కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దీంతో శశికళ ఇన్నాళ్లు కలలు కన్న సీఎం సీటు చేజారిపోయింది.
పళనిస్వామితో.. పన్నీరుపై పైచేయి
పన్నీర్ సెల్వంతో జరిగిన ఆధిపత్య పోరులో శశికళ ఓడిపోయింది. కానీ సీఎం సీటును చేజిక్కించుకునే విషయంలో తానే పైచేయి సాధించింది. శశికళ జైలుకెళ్లే ముందు సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును ఆమె ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు కూడా ఆయనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో శశికళతో చికాకు తీరిపోయిందని భావించిన పన్నీర్కు పళనిస్వామి రూపంలో మరో పెద్ద సమస్య ఎదురైంది. అయినా ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని చెప్పిన పన్నీర్ మాటలు ప్రగల్భాలేనని తేలిపోయింది.
పన్నీరుకు ఆశాభంగం
శశికళ జైలుకెళ్లిన తర్వాత ఎమ్మెల్యేలు తన క్యాంపులోకి క్యూ కడతారని ఆశించిన పన్నీర్కు ఆశాభంగం తప్పలేదు. శశికళ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు అనంతరం శశివర్గంలోని ఎమ్మెల్యేలను తనకు మద్దతివ్వాలని కోరుతూ పన్నీర్ ఓ లేఖ విడుదల చేశారు. ఆ పిలుపుకు ఎమ్మెల్యేల నుంచి స్పందన కరువైంది. శశికళ జైలుకెళ్లినా సరే ఎమ్మెల్యేలు ఏ మాత్రం జంకలేదు. పళనిస్వామికే అండగా నిలిచారు. ఫిబ్రవరి 15న శశికళ జైలుకెళ్లారు.
శశికళ శపథం
కాగా, శశికళ జైలుకెళ్లే ముందు శశికళ సమాధి వద్దకు వెళ్లి శపథం చేశారు. ద్రోహులను వదలనని ప్రతిన పూనారు. పళనిస్వామికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ అవకాశం ఇవ్వడంతో శశికళ తన పంతాన్ని నెగ్గించుకున్నటైంది.
పన్నీరు పోరాటం బూడిదలో పోసిన పన్నీరే...
పన్నీర్ను సీఎం కాకుండా శశికళ పళనిస్వామిని తెరపైకి తెచ్చి అడ్డుకోగలిగింది. దీంతో ఏ సీఎం పీఠం కోసమైతే శశికళపై పన్నీర్ తిరుగుబాటు చేశారో అదంతా బూడిదలో పోసిన పన్నీరైంది. పళనిస్వామి గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
పన్నీరువర్గంలో నైరాశ్యం-జైలు నుంచే శశికళ
గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయంతో పన్నీర్ వర్గంలో నైరాశ్యం నెలకొంది. ఇన్ని రోజులు పన్నీర్ ఇంటి వద్ద కనిపించిన కోలాహలమంతా నేడు వెలవెలబోయింది. జయలలిత జైలుకెళ్లిన సమయంలో పన్నీర్ను సీఎం చేసి కథంతా అక్కడ నుంచే నడిపారు. ఇప్పుడు శశికళ కూడా పళనిస్వామిని సీఎంగా చేసుకుని జైలు నుంచి సీఎం కాని సీఎంగా తమిళనాడును పరిపాలించే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.