బాలాకోట్ వైమానిక దాడులు గురితప్పాయా? తొలి ఉపగ్రహ ఫొటో ఏమి చెబుతోంది? విధ్వంసపు ఆనవాళ్లు ఏవీ:రిపోర్ట్
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖకు అవతల పాకిస్తాన్ భూభాగంపై ఉన్న బాలాకోట్ పట్టణ సమీపంలోని పర్వత ప్రాంతాల్లో జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అతి పెద్ద శిక్షణా శిబిరంపై భారత వైమానిక దళం దాడులపై కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దాడులు చేయడం నిజమే అయినప్పటికీ.. 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారనడానికి సరైన సాక్ష్యాధారాలు చూపాలని, దీనికి సంబంధించిన ఉపగ్రహ ఫొటోలను బహిర్గతం చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.
పటేల్ రిజర్వేషన్ల గళం.. ఇక లోక్ సభలో: హార్ధిక్ పటేల్ కు కాంగ్రెస్ గాలం
బాలాకోట్ దాడులపై సాక్ష్యాధారాలను బహిర్గతం చేయాలంటూ దిగ్విజయ్ సింగ్, కపిల్ సిబల్, మమతా బెనర్జీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాటు పలువురు ప్రతిపక్షపార్టీల నాయకులు పట్టుబట్టారు. వైమానిక దాడులు నిజమేనని, అవి లక్ష్యాన్ని ఛేదించలేకపోయి ఉండొచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. 300 నుంచి 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పడం అనుమానాలు ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. ఉగ్రవాదులు హతమయ్యారనడానికి సాక్ష్యాధారాలు గానీ, ఉపగ్రహ ఫొటోలు గానీ విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వారి అనుమానాలకు తావిచ్చేలా బుధవారం ఉదయం ఓ ఉపగ్రహ ఫొటో వెలుగులోకి వచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయటర్స్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఓ కథనాన్ని రాసింది.
ఫొటో ఏం చెబుతోంది?
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కేంద్రంగా పని చేస్తోన్న ప్లానెట్ ల్యాబ్స్ అనే ఉపగ్రహాలను పర్యవేక్షించే సంస్థ ఈ ఫొటోను తీసింది. దీనిపై శాస్త్రీయబద్ధంగా విశ్లేషణ చేసింది. వైమానిక దాడులు చోటు చేసుకున్న బాలాకోట్ సమీపంలోని జబా పర్వత ప్రాంతానికి సంబంధించిన పిక్ ఇది. ఈ ఫొటోలో కనిపిస్తోంది.. ఓ మదరసా భవనం. జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఆధ్వర్యంలో ఈ మదరసా నడుస్తోంది. వైమానిక దాడులకు ముందు ఎలా ఉండేదో.. దాడుల తరువాత కూడా ఆ మదరసా భవనం చెక్కు చెదరలేదని ప్లానెట్ ల్యాబ్స్ విశ్లేషించింది. ఈ భవనం మాత్రమే కాకుండా.. అదే ప్రాంతంలో చాన్నాళ్లుగా కొనసాగుతున్న నాలుగైదు భవన సముదాయాలపై దాడులు చోటు చేసుకున్న ఆనవాళ్లేవీ కనిపించట్లేదని చెబుతోందా సంస్థ.
రాయటర్స్ కథనం సారాంశం ఇదే
వైమానిక దాడులు చోటు చేయడం నిజమే.. అయినప్పటికీ- జారవిడిచిన బాంబులు లక్ష్యాన్ని ఛేధించలేకపోయి ఉండొచ్చని కూడా రాయటర్స్ కథనం అభిప్రాయపడింది. వైమానిక దళం వేసిన బాంబులు.. నిర్మానుష్య ప్రదేశాల్లో పడి ఉంటాయనే అనుమానం కలిగించేలా కథనం ఉంది. వైమానిక దాడులు గురి తప్పాయని, బాంబులు నిర్మానుష్య ప్రదేశాల్లో పడ్డాయని పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు, బాలాకోట్ సమీపంలో నివసించే గ్రామీణులు కూడా ధృవీకరించిన విషయాన్ని ఇందులో పేర్కొంది.
విదేశాంగ శాఖ సమాధానం ఇవ్వలేదట
వైమానిక దాడుల తరువాత వెలుగులోకి వచ్చిన హైరిజల్యూషన్ తో కూడిన మొట్టమొదటి ఉపగ్రహ ఫొటో కావడంతో.. ప్రాధాన్యత సంతరించుకుంది. వైమానిక దళ దాడుల్లో ఈ భవనం నేలమట్టమైనట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. బాంబుదాడి చోటు చేసుకుని ఉంటే.. ఈ మదరసా భవనం పైకప్పుపై వాటి తాలూకు ఆనవాళ్లు గానీ, తూట్లు పడి గానీ కనిపించేవని, తాజా విశ్లేషణ ప్రకారం.. అలాంటివేమీ లేవని తేలింది. రాయటర్స్ సంస్థ ఈ ఫొటోను మనదేశ విదేశాంగ, రక్షణ మంత్రిత్వశాఖలకు ఇమెయిల్ ద్వారా పంపించింది. దీనిపై బుధవారం వరకు కూడా ఎలాంటి సమాధానం రాలేదని ఈ వార్తా సంస్థ వెల్లడించింది.
వైమానిక దాడి గురి తప్పిందా?
ఈ ఫొటోను ఆధారంగా చేసుకుని రాయటర్స్ సంస్థ ఓ ప్రత్యేక కథనాన్ని కూడా రాసింది. ఇందులో మిడిల్ బరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో తూర్పు ఆసియా ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేస్తోన్న జెఫ్రీ లూయిస్ పేరును ఉటంకించింది. ఉపగ్రహాలు పంపించిన ఫొటోలను విశ్లేషించడంలో జెఫ్రీ లూయిస్ కు 15 సంవత్సరాల అనుభవం ఉందని, ఆయన అంచనా ప్రకారం.. ఈ మదరసాపై ఎలాంటి దాడీ జరగలేదని పేర్కొంది. వెయ్యి కేజీల బరువు ఉన్న బాంబులను వేసి ఉంటే.. అక్కడ విధ్వంసం పుట్టుకుని వచ్చేదని, అలాంటి ఆనవాళ్లు లేవని జెఫ్రీ స్పష్టం చేసినట్లు రాయటర్స్ పేర్కొంది. వైమానిక దాడులు చోటు చేసుకుని ఉంటే.. జారవిడిచిన బాంబులు లక్ష్యాన్ని ఛేధించలేకపోయి ఉండొచ్చని కూడా రాయటర్స్ కథనం అభిప్రాయపడింది. వైమానిక దళం వేసిన బాంబులు.. నిర్మానుష్య ప్రదేశాల్లో పడి ఉంటాయనే అనుమానం కలిగించేలా కథనం ఉంది.
భారత వైమానిక దళం చెబుతున్నదేంటి?
ఈ కథనానికి భిన్నంగా భారత వైమానిక దళం ఓ ప్రకటన జారీ చేసింది. బాలాకోట్ పై చేపట్టిన దాడుల సందర్భంగా తాము జారవిడిచిన బాంబులు 80 శాతం మేర లక్ష్యాన్ని ఛేదించాయని వెల్లడించింది. రాయటర్స్ కథనం వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలో వైమానిక దళం ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి సంబంధించిన కొన్ని ఉపగ్రహ ఆధారతి ఫొటోలను కూడా విడుదల చేసింది.