భారత భూభాగంపైకి చైనా: అక్కడే గుడారాలు: ఘర్షణకు కారణం? శాటిలైట్ ఫొటోస్..రాహుల్ డౌట్స్
న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య సైనికుల మధ్య సరిహద్దుల్లోని గాల్వన్ వ్యాలీ వద్ద చోటు చేసుకున్న ప్రాణాంతక దాడులకు ప్రధాన కారణం ఏమిటనేది ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వారం రోజులు గడిచినప్పటికీ.. ఈ రెండు దేశాల సైనికుల మధ్య సంభవించిన పరస్పర దాడులు మిగిల్చిన ప్రకంపనలు, రగిల్చిన ఆగ్రహ జ్వాల చల్లారట్లేదు. ఈ ఘర్షణల అనంతరం పరిస్థితులు మరింత సంక్లిష్టంగా తయారయ్యాయి. యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి.
Recommended Video
జగన్ సర్కార్పై నిమ్మగడ్డ ఎదురుదాడి? ఆ విషయంలో హైకోర్టులో పిటీషన్? అడ్వొకేట్ జనరల్పై
ఘర్షణలకు అసలు కారణం
నిజానికి- భారత్ చైనా సరిహద్దుల్లో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు, గొడవలు చోటు చేసుకోవడం కొత్తేమీ కాదు. భారత్-చైనా మధ్య గల సరిహద్దుల వెంబడి ఇదివరకు గొడవ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. లఢక్ సెక్టార్ పరిధిలోనే అంతకుముందు కూడా పలుమార్లు వారి మధ్య ఘర్షణలు చెలరేగాయి. సిక్కిం సమీపంలోని డొక్లామ్ ట్రైజంక్షన్ సరిహద్దుల వివాదాల్లోనూ రెండు దేశాల సైనికులు పరస్పరం బాహాబాహీకి దిగిన సందర్భాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్ పరిధిలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి.
భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడం వల్లే..
ఈ సారి మాత్రం భారత ఆర్మీ, చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికుల మధ్య ప్రాణాలు పోయే స్థాయిలో పరస్పర దాడులు చోటు చేసుకోవడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. వాస్తవాధీన రేఖను దాటుకుని చైనా బలగాలు భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చాయని, అక్కడే గుడారాలను ఏర్పాటు చేసుకున్నారనే అనుమానాలు తాజాగా తలెత్తుతున్నాయి. భారత భూభాగంపైకి రావడమే కాకుండా.. అక్కడే శిబిరాలను సైతం నెలకొల్పడాన్ని భారత జవాన్లు అడ్డుకున్నారని అంటున్నారు.
శిబిరాలను తొలగింపు కోసం
భారత భూభాగంపైకి చైనా బలగాలు వేసిన శిబిరాలను తొలగించడం కోసం జవాన్లు పోరాడారని అంటున్నారు. అందువల్లే రెండు దేశాల వైపు భారీగా ప్రాణనష్టం సంభవించిందని అంటున్నారు. పీఎల్ఏ బలగాలు భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చిన విషయాన్ని శాటిలైట్ ఇమేజీలు స్పష్టం చేస్తున్నాయని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనుమానాలను వ్యక్తం చేశారు. చైనా బలగాలు భారత్, చైనాలను వేరు చేసే వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంపై అడుగు పెట్టాయని ఆయన చెప్పారు. పాంగాంగ్ లేక్ సమీపంలో చైనా జవాన్లు ఎల్ఏసీ దాటుకుని వచ్చారని, భారత్ను ఆక్రమించుకున్నారని అన్నారు.
వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే..
దీనిపై సరైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఘర్షణలు చోటు చేసుకుని 20 మంది భారత జవాన్లు అమరులైనప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గానీ, కేంద ప్రభుత్వం గానీ ఈ దిశగా ఒక్క వివరణ కూడా ఇవ్వలేదని, దీనికి కారణమేంటని ప్రశ్నించారు. ఓ జాతీయ మీడియా ప్రసారం చేసిన కథనాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ను ఆయన తన ట్వీట్కు జత చేశారు. దేశ ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేశారు.