ఒక ఏడాదే టైం: ఇక ఇంటర్నెట్ యమ స్పీడ్
భవిష్యత్లో దేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్ యుగం ఆవిష్కారం కానున్నది. ఈ ఏడాది చివర్లో ప్రయోగించబోయే భారీ జీ శాట్ -11 ఏకంగా 16 పుంజాలను ఉపయోగిస్తుంది.మూడు ఉపగ్రహాలు వినియోగంలోకి వచ్చాక..
న్యూఢిల్లీ: అంతరిక్ష పరిజ్ఞానంతో దేశ సామాజిక, ఆర్థిక, సాంకేతిక స్థితిగతులను మెరుగుపరచడమే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రధాన తంత్రం. ఈ దిశగా వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఇస్రో సద్వినియోగం చేసుకుంటున్నది. దేశంలో అంతంత మాత్రంగా ఉన్న ఇంటర్నెట్ వేగాన్ని పెంచే బాధ్యతను తీసుకున్నది. ఇక భవిష్యత్లో దేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్ యుగం ఆవిష్కారం కానున్నది. అంతర్జాతీయంగా ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య విషయమై చైనా తర్వాత రెండో స్థానంలో భారత్ నిలిచింది.
ఇది ఇంకా వృద్ధి చెందుతోంది. ఈ నెలాఖరు నాటికి వీరి సంఖ్య 45 - 46.5 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ఇంటర్నెట్ వేగం విషయంలో అనేక ఆసియా దేశాల కన్నా భారత్ చాలా వెనుకబడి ఉన్నది. అత్యంత అధునాతన 'హై థ్రోపుట్' ఉపగ్రహాల ద్వారా పలు దేశాలు తమ ఇంటర్నెట్ వేగం పెంచుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్ మాత్రం 105వ స్థానంలో ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. కానీ వచ్చే 18 నెలల్లో ఈ పరిస్థితి మారిపోనున్నది. ఇందుకు హైథ్రోపుట్ సామర్థ్యం ఉన్న మూడు ఉపగ్రహాలను ఇస్రో సిద్ధం చేస్తోంది. తాజా జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా ప్రయోగించిన జీశాట్ - 19 ఇందులో మొదటిది. ఆ తర్వాత జీ శాట్ - 11, జీ శాట్ - 20లను కక్ష్యలోకి పంపనున్నది.
సమాచార వ్యవస్థను మార్చివేయనున్న జీ శాట్ 19
జీఎస్ఎల్వీ మార్క్-3 మోసుకెళ్లిన జీశాట్-19 ఉపగ్రహం దేశంలో సమాచార వ్యవస్థ రూపురేఖలను మార్చివేయనున్నదని భావిస్తున్నారు. ఇది పాత తరానికి చెందిన ఏడు సమాచార ఉపగ్రహాలకు సమానమని, దీంతో ఇంటర్నెట్ స్పీడ్ నాలుగు రెట్లు పెరుగుతున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇదివరకు ఇన్శాట్ (ఇండియన్ నేషనల్ శాటిలైట్) పేరిట కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించింది. కొత్త తరహా ఇన్శాట్లకు ఇప్పుడు జీశాట్ (జియో సింక్రనస్ శాటిలైట్) అని పేరు పెట్టారు.
ఉపగ్రహాల ప్రయోగ లక్ష్యాలివి:
సమాచార, ప్రసార సేవలు అందించడమే ఇన్శాట్, జీశాట్ ఉపగ్రహాల ప్రధాన ఉద్దేశం. జీఎస్ఎల్వీ మార్క్-3 మోసుకెళ్లిన జీశాట్-19 బరువు 3,136 కిలోలు. భారత్ ప్రయోగించిన ఈ అతి భారీ ఉపగ్రహం పదేళ్లపాటు కమ్యూనికేషన్ సేవలందిస్తుంది. ఈ ఉపగ్రహంలో జియోస్టేషనరీ రేడియేషన్ స్పెక్ట్రోమీటర్ (గ్రాస్ప్)ను అమర్చారు. అది ప్రకృతిలోని ఆవిష్ట కణాల స్వభావాన్ని పరిశీలిస్తూ అధ్యయనం చేస్తుంది.
జీశాట్-19 పలు అధునాతన అంతరిక్ష సాంకేతిక పరికరాలు కలిగి ఉంది. వాటిలో సూక్ష్మమైన హీట్ పైప్, ఫైబర్ ఆప్టిక్ గైరో, సూక్ష్మమైన ఎలక్ట్రో మెకానికల్ వ్యవస్థ, కేయూ-బ్యాండ్ టీటీసీ ట్రాన్స్పాండర్, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన లిథియం అయాన్ బ్యాటరీ ఉన్నాయి. రాకెట్ నుండి భూ స్థిరకక్ష్యలోకి ప్రవేశించడానికి జీశాట్-19కు సొంతంగా చోదక వ్యవస్థ ఉంది. టెలివిజన్, టెలిఫోన్, రేడియో, ఇంటర్నెట్, సైనిక అవసరాలను శాటిలైట్ తీర్చనున్నది.
శాటిలైట్స్ ఉపయోగాలివి
ఈ ఉపగ్రహాలు మల్టిపుల్ స్పాట్ బీమ్స్ ఉపయోగించుకుంటాయి. ఇది ఒక ఉపగ్రహ సంకేతం. ఉపగ్రహంలోని ఏంటెన్నా ద్వారా 'హై గెయిన్' వెలువడుతున్నా ఒకే చోట పోగుపడుతుండటంతో పరిమితస్థాయిలో భూభాగాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. ఈ పుంజం ఎంత సన్నగా ఉంటే.. అంత ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. జీశాట్ -19, 11, 20 ఉపగ్రహాలు చిన్న భూభాగాలపై ఈ పుంజాలను పదేపదే ప్రయోగిస్తాయి.
సంప్రదాయ ఉపగ్రహాల్లో ఇందుకు భిన్నంగా పెద్ద భూభాగం కవర్ చేయడానికి విశాలమైన ఒకే పుంజాన్ని ఉపయోగిస్తారు. అంటే ఒకే బ్యాండ్విడ్త్ను వినియోగదారులు పంచుకోవాల్సి వచ్చేది. లోగడ ప్రయోగించిన జీశాట్ ఉపగ్రహాల్లో డేటా బట్వాడా వేగం సెకనుకు ఒక గిగా బైట్ మేర ఉంది. జీశాట్ - 19 ద్వారా అది 4 గిగాబైట్లకు పెరుగుతుంది. అంటే.. ఇదొక్కటే నాలుగు ఉపగ్రహాలతో సమానం అన్నమాట.
ఇంటర్నెట్ వేగం దిశగా ఇలా అడుగులు
ఈ ఏడాది చివర్లో ప్రయోగించబోయే భారీ జీ శాట్ -11 ఏకంగా 16 పుంజాలను ఉపయోగిస్తుంది. అది సెకనుకు 13 గిగాబైట్ల మేర డేటాను బట్వాడా చేస్తుంది. ఆ తర్వాత ప్రయోగించబోయే జీశాట్ - 20 మరో అడుగు ముందుకేసి 40 పుంజాలను వాడుతుంది. ఒక్కో పుంజంలో రెండు పోలరైజేషన్లు ఉంటాయి. ఫలితంగా దానిలో 80 పుంజాలున్నట్లు లెక్క. ఈ ఉపగ్రహం సెకనుకు 70 గిగాబైట్ల డేటాను బట్వాడా చేస్తుంది.
ఈ మూడు ఉపగ్రహాలు వినియోగంలోకి వచ్చాక.. హైస్పీడ్, నాణ్యమైన ఇంటర్నెట్, ఫోన్, వీడియో సేవలు అందుబాటులోకి వస్తాయి. కేబుల్ వైర్ల అవసరం తప్పిపోతుంది. హైస్పీడ్ వైర్లెస్ సేవల ద్వారా ఇళ్లలోని టీవీలు, ఇతర కమ్యూనికేషన్ సాధనాలను అనుసంధానించడానికి వీలవుతుంది. ఇప్పటికే టెలిఫోన్లు ఇంటర్నెట్లోకి వెళ్లిపోయాయి. టీవీలు కూడా అందులోకే పయనమయ్యే రోజు దగ్గర్లోనే ఉందన్నమాట. జీశాట్ -19లో ఎలాంటి ట్రాన్స్పాండర్లు ఉండవు. ట్రాన్స్పాండర్లు లేకుండా ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించడం ఇదే మొదటిసారి.