జాడ తెలియని ఏఎన్-32 ఎయిర్క్రాఫ్ట్: రంగంలో ఉపగ్రహాలు, గూఢచర్య విమానాలు
న్యూఢిల్లీ: జాడ తెలియకుండా పోయిన వైమానిక దళానికి చెందిన ఆంటొనొవ్-32 రకానికి చెందిన విమానాన్ని గాలించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సహాయాన్ని తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 24 గంటల కిందట అదృశ్యమైన ఏఎన్-32 విమానం లేదా దాని శకలాలను గుర్తించడానికి ఇస్రో అంతరిక్షంలోని ప్రయోగించిన ఉపగ్రహాల ద్వారా అన్వేషణ చేపట్టాలని వైమానిక దళ అధికారులు తీర్మానించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది.
ఇస్రో ఉపగ్రహాలతో పాటు నౌకాదళానికి చెందిన పీ-81 గూఢచర్య విమానాలను కూడా రంగంలోకి దించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రెండింటి సహకారంతో ఏఎన్-32 విమాన శకలాలను కనుగొనడానికి సన్నాహాలు చేస్తున్నారు వైమానిక దళ అధికారులు. నౌకాదళానికి చెందిన ఈ విమానాలు తమిళనాడులోని అరక్కోణంలో ఉన్న నేవీ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరి వెళ్లాయి.
అస్సాంలోని జోర్హాట్ బేస్ క్యాంప్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ విమానం అరుణాచల్ ప్రదేశ్లోని మేఛుకా గ్రామంలో వైమానిక దళ అవసరాల కోసం నిర్మించిన విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12:25 నిమిషాలకు ల్యాండ్ కావాల్సి ఉండగా.. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ విమానంతో సంబంధాలు తెగిపోయాయినట్లు గుర్తించారు అధికారులు. అప్పటి నుంచీ విమానం జాడ కానరాలేదు. రాడార్తో సంబంధాలు తెగినప్పటి నుంచి అధికారులు జోర్హాట్, మఛుకా మధ్య గల ప్రాంతాలను జల్లెడ పట్టారు.
అణువణువూ గాలించారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గాలించినప్పటికీ.. ఫలితం కనిపించలేదు. రాత్రిళ్లు కూడా గాలింపు చర్యలు కొనసాగాయి. అదృశ్యమైన ఏఎన్-32 విమానంలో భారత వైమానిక దళానికి చెందిన 13 మంది సిబ్బంది కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం. విమానం అన్వేషణలో భాగంగా ఇప్పటికే సుఖోయ్-30ఎంకెఐ, సూపర్ హెర్కులెస్ సీ-130జే రకానికి చెందిన యుద్ధ విమానాలను వినియోగిస్తున్నారు.
వాటితో నౌకాదళానికి చెందిన పాటు పీ-81 ఎయిర్క్రాఫ్ట్ ఐఎన్ఎస్ రాజాళిని రప్పించారు. తమిళనాడులోని అరక్కోణంలో ఉన్న నేవీ బేస్క్యాంప్ నుంచి ఈ విమానం మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లింది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇది గాలింపు చర్యల్లో చేరింది.
2016లో కూడా ఇదే రకం విమానం గల్లంతైన విషయం తెలిసిందే. చెన్నైలోని తాంబరం బేస్క్యాంప్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఆంటొనోవ్-32 ఎయిర్క్రాఫ్ట్ అండమాన్ వెళ్తూ బంగాళాఖాతం గగనతలంలో అదృశ్యమైంది. ఈ విమానం జాడ ఇప్పటికీ తెలియరాలేదు. ఏమైందో తెలియదు. ఇందులో మొత్తం 29 మంది వైమానిక దళ జవాన్లు, వారి కుటుంబ సభ్యులు మరణించినట్లుగా ప్రకటించారు అధికారులు. అలాంటి పరిస్థితే ఇప్పుడు కూడా పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని వైమానిక దళ అధికారులు ఆందోళన చెందుతున్నారు.