నాకు రక్షణ కల్పించండి: సుప్రీం కోర్టును ఆశ్రయించిన సతీష్ సానా
ఢిల్లీ: తన స్టేట్మెంట్తో స్వతంత్ర విచారణ సంస్థ సీబీఐలో చిచ్చు రేపిన హైదరాబాద్ వ్యాపారవేత్త సతీష్ సానా తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తను విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ సమన్లు పంపడంతో తనకు రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టును కోరారు.
మాంసం వ్యాపారి మోయిన్ ఖురేషీ కేసులో తనను ఎలాంటి విచారణ చేయకూడదని చెప్తూ కేసును విచారణ చేస్తున్న సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాకు రూ. 2 కోట్లు లంచం ఇచ్చినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 2017 నుంచి 10 నెలల పాటు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లించినట్లు తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు సతీష్ సానా. ఇక డబ్బులు ఇవ్వడం గతేడాది డిసెంబర్ నుంచి ప్రారంభమైనట్లు సతీష్ సానా తన స్టేట్మెంట్లో వెల్లడించాడు.
మోయిన్ ఖురేషీ కేసును రాకేష్ అస్తానా నేతృత్వంలో ఏర్పాటైన సిట్ విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే సతీష్ సానా మనోజ్ అనే వ్యక్తిని కలిసినట్లు తెలుస్తోంది. మనోజ్ సోదరుడు సోమేష్కు రాకేష్ ఆస్తానాతో మంచి సంబంధాలున్నాయని సతీష తెలుసుకున్నాడు. సోమేష్ రాకేష్ అస్తానాతో మాట్లాడి కేసునుంచి బయటపడేస్తారని కూడా చెప్పినట్లు మనోజ్ వెల్లడించినట్లు తెలుస్తోంది. సతీష్ సానా ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేసిన సీబీఐ రాకేష్ ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ ముడుపులు తీసుకుని అతన్ని అరెస్టు చేయించే కుట్ర పన్నారని అలోక్ వర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కేంద్రం కల్పించుకుని అలోక్ వర్మ, రాకేష్ ఆస్తానాలను సెలవుపై పంపింది.
తన బాధ్యతల నుంచి తప్పిస్తూ సెలవుపై కేంద్రం పంపడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ. విచారణ చేసిన ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రెండు వారాల్లోగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని సూచించింది. ఈ కేసును పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని సర్వోన్నత న్యాయస్థానం నియమించింది.