సీబీఐ కేసులో సతీష్ సానా అరెస్ట్... ఏపీ , తెలంగాణ బడాబాబుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు..!
హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్త సతీష్ సానాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ అధికారులు ఢిల్లీలో అరెస్టు చేశారు. గతేడాది అక్టోబర్లో సతీష్ సానా పేరు ప్రధాన వార్తల్లో నిలిచింది. సీబీఐలో అప్పటి డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్తానాల మధ్య విబేధాలు తలెత్తిన సమయంలో సతీష్ సానా పేరు కూడా బయటకొచ్చింది. రాకేష్ అస్తానాపై సతీష్ సానా లిఖిత పూర్వకమైన ఫిర్యాదు ఇవ్వడంతో ఆ మాజీ స్పెషల్ డైరెక్టర్ పై అవినీతి కేసు నమోదైంది.
మనీలాండరింగ్ ఆరోపణలు
ప్రముఖ మాంసం ఎగుమతిదారుడు మోయిన్ ఖురేషీ కేసులో ప్రధాన నిందితుడిగా సతీష్ సానా ఉన్నాడు. మనీలాండరింగ్కు సతీష్ సానా పాల్పడ్డారనే ఆరోపణలపై ఈడీ అధికారులు సతీష్ను అరెస్టు చేశారు. సానాను శుక్రవారం అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఏడు గంటల పాటు ప్రశ్నలు సంధించారు. అయితే అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అధికారులు అరెస్టు చేశారు. త్వరలోనే ఆయన్ను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి అప్పగించాల్సిందిగా ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని కోరనున్నారు.
పొంతన లేని సమాధానాలు ఇచ్చిన సానా
మోయిన్ ఖురేషీకి చెందిన సంస్థలో రూ.50 లక్షలు విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ కంపెనీపై ప్రస్తుతం ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే చాలా ఏళ్ల క్రితమే ఈ షేర్లను కొనుగోలు చేసినట్లు చెబుతున్న సానా సతీష్... మరి షేర్లు తన చేతికి ఎందుకు అందలేదు అనేదానిపై సమాధానం చెప్పలేదు. అంతేకాదు డబ్బులు తిరిగి వెనక్కు ఇవ్వాలని ఖురేషీని ఎందుకు అడగలేదన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని సమాచారం. సీబీఐలో ఓ అవినీతి కేసును సానా సతీష్ ఎదుర్కొంటున్నాడు. విచారణా అధికారులను మేనేజ్ చేయాల్సిందిగా ఈ డబ్బులను ఖురేషీకి ఇచ్చి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తోంది ఈడీ. ఇదిలా ఉంటే ఖురేషీ పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులకు సతీష్కు మధ్య మధ్యవర్తిత్వం నెరుపుతున్నారనే అనుమానం వ్యక్తం చేసింది సీబీఐ.
రాకేష్ అస్తానాకు ముడుపులు ఇవ్వజూపారనే ఆరోపణలు
గతేడాది సెప్టెంబర్లో మోయిన్ ఖురేషీ కేసును విచారణ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కు అప్పటి స్పెషల్ డెరెక్టర్ రాకేష్ ఆస్తానా నేతృత్వం వహించారు. అయితే సానాను అరెస్టు చేయాలని రాకేష్ అస్తానా భావించారు. ఇక అరెస్టు నుంచి తప్పించుకునేందుకు రాకేష్ అస్తానాకు సతీష్ సానా ముడుపులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై అప్పుడే రాకేష్ అస్తానాను సీబీఐ అరెస్టు చేయాలని భావించింది. ఈ డబ్బులను దుబాయ్లోని మనోజ్, మరియు సోమేష్ ప్రసాద్ అనే సోదరుల ద్వారా అస్తానాకు రూ. 5 కోట్లు చేరవేయాలని భావించారు. ఈ ఇద్దరు సోదరులు రాకేష్ అస్తానాకు మంచి మిత్రులని తెలుస్తోంది.
సానా అరెస్టుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనాలు
ఇదిలా ఉంటే ఓ కేసులో తనకు ఊరట లభించేలా చూడాలని ఆ నాటి టీడీపీ నేత ప్రస్తుతం బీజేపీ నేత అయిన సీఎం రమేష్ను సానా సతీష్ కలిసినట్లు విచారణ సందర్భంగా ఆరోజున తెలిపాడు. అయితే సీఎం రమేష్ నాటి డెరెక్టర్ అలోక్ వర్మతో మాట్లాడిన తర్వాత విచారణ పేరుతో తనను పిలువలేదని సానా తెలిపాడు. అయితే అప్పుడే తనకు సంబంధం లేదని తాను అలోక్ వర్మతో మాట్లాడలేదని సీఎం రమేష్ వివరణ ఇచ్చారు.
మొత్తానికి సతీష్ సానా అరెస్టుతో ఇంకా ఎంతమంది పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయో అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. సతీష్ సానా తెలుగురాష్ట్రాలకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడి రాజకీయనాయకుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే సానాతో సన్నిహితంగా మెలిగిన రాజకీయనాయకుల పరిస్థితి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.