ఉపశమనం: విద్యార్థులకు సర్కారు వరం.. శనివారం ‘నో బ్యాగ్ డే’
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు కాస్త ఉపశమనం కలిగించే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు శనివారం నాడు పాఠశాలలకు స్కూల్ బ్యాగు తీసుకురావాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసింద
లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు కాస్త ఉపశమనం కలిగించే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే విద్యార్థులు శనివారం నాడు పాఠశాలలకు స్కూల్ బ్యాగు తీసుకురావాల్సిన అవసరం లేదని సర్క్యూలర్ జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. శనివారంను 'నో బ్యాగ్ డే'గా ప్రకటించింది. ప్రతీ శనివారం పిల్లలకు పాఠాలు బోధించడం కాకుండా.. ఇతర యాక్టివిటీస్ చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఉల్లాస, సంతోషభరితమైన కార్యక్రమాలు చేయించడం వలన పిల్లల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్తో పాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య మంచి సంబంధం ఏర్పడుతుందని యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ తెలిపారు.
కనీసం వారానికి ఒక్కరోజైనా స్కూల్ బ్యాగు మోయక పోవడం వల్ల తల, మెడ, మోకాళ్లకు పనిభారం తగ్గి, విద్యార్థులు కాస్త ఉపశమనం పొందుతారని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.