సత్యం స్కాం: రామలింగరాజు ఖైదీ నెంబర్ 4148, పక్కనే తమ్ముడు
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో శిక్ష పడిన సత్యం రామలింగ రాజును చర్లపల్లి జైలుకు తరలించి, ప్రిజనర్ నెంబర్ 4148లో ఉంచారు. రామలింగ రాజు సోదరుడు రామరాజును ప్రిజనర్ నెంబర్ 4147లో ఉంచారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత గురువారం సాయంత్రం రామలింగ రాజు, ఇతర దోషులను చెర్లపల్లి జైలుకు తరలించారు.
కాగా, రామలింగ రాజుతో పాటు పది మందికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రామలింగరాజుకు, ఆయన సోదరుడు రామరాజుకు 5 కోట్ల రూపాయల జరిమానా, మిగతా దోషులకు 24 లక్షల రూపాయలేసి జరిమానా విధించింది.
సత్యం కేసులో నిందితుడిగా రామలింగ రాజు గతంలో 33 నెల పాటు జైలులో ఉన్నారు. తనకు శిక్ష తగ్గించాలని రామలింగ రాజు కోర్టును కోరుకున్నారు. సత్యం కుంభకోణం కేసులో రాజు సహా ఆయన తమ్ముడు రామరాజు, సత్యం మాజీ సీఎఫ్వో వడ్లమాని శ్రీనివాస్గుప్తా కూడా రూ.2 లక్షల వ్యక్తిగత పూచికత్తుపై సుప్రీం 2011 నవంబర్ 4న బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి బయటే ఉంటూ విచారణకు హాజరవుతున్నారు.
మరోవైపు, సత్యం కేసు తీర్పు వెలువరించిన రోజే హైదరాబాద్ రేంజ్ సీబీఐ ఎస్పీ చంద్రశేఖర్కు పదోన్నతి లభించింది. ఎస్పీగా కోర్టుకు వచ్చిన ఆయన సాయంత్రం డీఐజీగా వెనుదిరిగారు. అతిపెద్ద ఆర్థిక కుంభకోణం కేసులో సీబీఐ కేసు నెగ్గడం, అదేరోజు హైదరాబాద్ రేంజ్ అధికారికి పదోన్నతి రావడంతో సీబీఐ అధికారులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. తనకు అధికారికంగా పదోన్నతి ఉత్తర్వులు అందలేదని చంద్రశేఖర్ చెప్పారు.