హాంకాంగ్ బాటలోనే సౌదీ- భారత్తో విమానాల రాకపోకలు బంద్- కరోనా కేసుల వల్లే...
భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు విదేశీ ప్రభుత్వాలను సైతం భయపెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్ధానంలో ఉన్న భారత్ నుంచి రాకపోకలు నియంత్రించేందుకు పలు దేశాలు సిద్ధమవుతున్నాయి. కరోనా ప్రభావం మొదలైన కొత్తలో విదేశాల నుంచి రాకపోకలను భారత్ రద్దు చేయగా.. ఇప్పుడు ఆయా దేశాలు భారత్ నుంచి రాకపోకలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పటికే హాంకాంగ్ ఉండగా.. తాజాగా సౌదీ అరేబియా కూడా చేరింది. ఆయా దేశాల ప్రభుత్వాల నిర్ణయాలతో భారత్ ప్రస్తుతం కొనసాగిస్తున్న వందే భారత్ మిషన్ పైనా ప్రభావం పడబోతోంది.
భారత్లో కరోనా ప్రభావం...
భారత్లో కరోనా ప్రభావం నానాటికీ పెరుగుతోంది. రోజుకు వేల సంఖ్యలో వస్తున్న కొత్త కేసులతో పలు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఇప్పటికే 56 లక్షలు దాటిపోయిన కరోనా కేసులతో కేంద్రం కూడా పలు సందర్భాల్లో చేతులెత్తేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణ కోసం పలు చర్యలు తీసుకుంటున్నా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రికవరీల సంఖ్య పెరగడం ఒక్కటే ప్రభుత్వాల పాలిట ఊరటగా మారుతోంది. అయితే ప్రయాణాలపై కూడా ఆంక్షలు ఎత్తేయడంతో దేశీయంగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే విదేశాలకు వెళ్లే ప్రయాణికుల్లోనూ కరోనా కేసులు నమోదవుతుండటంతో విదేశాలు అప్రమత్తమవుతున్నాయి. భారత్లో పరిస్ధితి దృష్ట్యా తమ దేశాలకు ప్రయాణాలు అనుమతించబోమని చెబుతున్నాయి.
ఎయిర్ ఇండియా ఫ్లైట్లపై హాంకాంగ్ నిర్ణయం....
భారత్ నుంచి హాంకాంగ్కు వచ్చే ఎయిర్ ఇండియా విమానాల నుంచి కరోనా కేసులు పెరుగుతున్న సమాచారంతో ఆ దేశం అప్రమత్తమైంది. గత ఆదివారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. భారత్ నుంచి వస్తున్న ప్రయాణికులతో కరోనా కేసులు పెరుగుతున్న గుర్తించిన హాంకాంగ్ ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలికంగా విమానాల రాకపోకలను నియంత్రిస్తూ ఈ మధ్యే నిర్ణయం తీసుకుంది. గత నెలలోనూ ఢిల్లీ నుంచి హాంకాంగ్ కు వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఏకంగా 14 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో భారత్ పేరెత్తితేనే హాంకాంగ్ వణుకుతోంది.
Recommended Video
సౌదీ అరేబియా నిషేధం..
అంతర్జాతీయంగా కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల నుంచి తమ దేశానికి విమానాల రాకపోకలను నిషేధిస్తూ సౌదీ అరేబియా ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఇందులో భారత్తో పాటు బ్రెజిల్, అర్జెంటీనా ఉన్నాయి. తాజాగా ఆయా దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసుల ఉధృతితో పాటు అక్కడి నుంచి వచ్చే విమానాల్లో ప్రయాణికులకు కూడా కరోనా పాటిజివ్గా నిర్ధారణ అవుతుండటంతో సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత రెండు వారాల్లో ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులపైనా నిఘా పెట్టింది. అయితే ఇందులో సౌదీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రభుత్వ అధికారులు, పెద్దలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. సౌదీతో పాటు యూఏఈలోనూ భారతీయుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. వాస్తవానికి రెండు రోజుల క్రితమే ఇద్దరు కోవిడ్ బాధితులను తీసుకొచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్పై అక్కడి పౌర విమానయానశాఖ 24 గంటల పాటు నిషేధం విధించింది.