బిగ్ డీల్ : రిలయన్స్ లక్ష కోట్ల అప్పులను తీర్చడంలో సౌదీ అరాంకో ప్రముఖ పాత్ర
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పట్టిందల్లా బంగారంగా మారుతోంది. ప్రపంచ దేశాల ధనికుల్లో ఒక్కరుగా ఉన్న అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని అన్ని రంగాలకు విస్తరించారు. అయితే సోమవారం జరిగిన కంపెనీ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పలు ఆసక్తికర ప్రకటనలు ముఖేష్ అంబానీ చేశారు. తన కంపెనీని మరో 18 నెలలో అప్పులు లేని కంపెనీగా చేసి వాటాదారులకు లాభాలను అందజేస్తామని ప్రకటించారు. గత ఐదేళ్లలో రిలయన్స్ సంస్థ 76 బిలియన్ డాలర్ల మూలధన వ్యయాన్ని సేకరించింది.
సౌదీ అరాంకోకు 20 శాతం వాటాలు విక్రయం
ఇక రిలయన్స్కు ఊపిరిపోసిన ఆయిల్ టు కెమికల్ బిజినెస్లో 20శాతం వాటాలను సౌదీ అరేబియాకు చెందిన ప్రపంచ ఆయిల్ దిగ్గజ కంపెనీ ఆరాంకోకు విక్రయించే యోచనలో ముఖేష్ అంబానీ ఉన్నట్లు తెలిపారు.మొత్తం 75 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు చర్చలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ డీల్ విలువ రూ.1.1లక్షల కోట్లుగా రిలయన్స్ పేర్కొంది. మరో ఐదేళ్లలో రీటైల్ రంగం మరియు టెలికాం రంగంలలో కూడా లిస్టింగ్ చేసేందుకు కంపెనీ సన్నహాలు చేస్తోందని తెలిపారు.గతేడాది ముగింపు నాటికి రిలయన్స్కు రూ.1,54,478 కోట్ల రుణం ఉంది. ఈ చెల్లింపులకు నగదు సమీకరణ కోసం కొన్ని వ్యాపారాల్లో వాటాల విక్రయాన్ని వేగవంతం చేసింది. ఇది పూర్తయితే వాటాదారులకు డివిడెండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు కంపెనీ విలువ కూడా భారీగా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అప్పులు తీర్చేందుకు వేగంగా అడుగులు వేస్తున్న అంబానీ
2016లో టెలికాం రంగంలో పూర్తిగా నిమగ్నమైన అంబానీ కంపెనీ రుణాలను తీర్చేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే జియో కోసం 50 బిలియన్ డాలర్లను అంబానీ పెట్టుబడిగా పెట్టారు. ఇందులో అధికశాతం అప్పుగా తీసుకొచ్చిన డబ్బులనే పెట్టుబడిగా పెట్టారు. ఈ అప్పులను కూడా పూర్తిగా తీర్చేందుకు అంబానీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం రిలయన్స్కు చెందిన రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ల విలువను కూడా జత చేయనున్నారు. ఇదే జరిగితే ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీల్లో రిలయన్స్ కూడా ఒకటి అవుతుందని అంబానీ సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు.
ఈ కామర్స్లోకి కూడా అడుగుపెట్టనున్న అంబానీ
ఇక త్వరలోనే ఈకామర్స్లోకి కూడా రిలయన్స్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా అడుగుపెడితే ప్రఖ్యాత ఈకామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్ వాల్మార్ట్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. టిఫెనీ అండ్ కోతో కూడా ఈనెలలోనే జతకడుతున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా నగల దుకాణాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఈ ఏడాది మేలో బిట్రన్కు చెందిన ప్రముఖ బొమ్మల స్టోర్ హామ్లేస్ను 82 మిలియన్ డాలర్లు వెచ్చించి మెజార్టీ వాటాను దక్కించుకున్నారు.