భారతీయుల ఖర్చులు సౌదీ భరిస్తుంది: సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకువస్తామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. గురువారం సుష్మా స్వరాజ్ రాజ్యసభలో మాట్లాడారు.
రెండు రోజుల్లో భారతీయుల సమస్యలు పరిష్కరించాలని సౌదీ రాజు స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సుష్మా స్వరాజ్ తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడిన భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు వీలుగా ఎగ్జిట్ వీసాలు అవసరం అన్నారు.
ఎగ్జిట్ వీసాలు ఇచ్చేందుకు సౌదీ ప్రభుత్వం అంగీకరించిందని వివరించారు. భారతీయులు సురక్షితంగా స్వదేశానికి పంపడానికి అయ్యే ఖర్చు సౌదీ ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులను ఆదుకోవడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం సిద్దం అయ్యిందని అన్నారు.
ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులను దేశంలో ఇతర కంపెనీల్లో చేర్చుకోవడానికి సౌదీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సుష్మా స్వరాజ్ వివరించారు. భారతీయులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆమె రాజ్యసభలో చెప్పారు.
శిబిరాల్లో తలదాచుకున్న భారత కార్మికులకు ఆహారం, వసతి కల్పిస్తున్నామని, వైద్యం అందిస్తున్నామని సౌదీ అరేబియా ప్రభుత్వం చెప్పిందని ఇదే సందర్బంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వివరించారు.