తక్కువ ఆదా..ఎక్కువ ఖర్చు: ఉద్యోగస్తులకు కేంద్రం వేస్తున్న కొత్త మంత్రం ఏంటి..?
న్యూఢిల్లీ: కేంద్రం వ్యవస్థీకృత ఉద్యోగులకు ఒక రకంగా గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. లక్షలాది ఉద్యోగుల వేతనాల్లో మార్పులు చేయనుంది. కేంద్రం ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి మార్పులు తీసుకురానుంది..? కేంద్రం ఉద్యోగులకు అందివ్వనున్న తీపి కబురేంటి.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పీఎఫ్ తగ్గించి.. వేతనంకు జమ
లక్షలాది మంది వ్యవస్థీకృత ఉద్యోగుల వేతనాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నట్లు సమాచారం. ఉద్యోగులకు వచ్చే ప్రావిడెంట్ ఫండ్ను తగ్గించుకుని ఆ తగ్గించుకున్న మొత్తాన్ని "టేక్ హోం పే" కి జమయ్యేలా తీసుకునే ఛాయిస్ను ఉద్యోగస్తులకు కేంద్రం ఇవ్వనుంది. ప్రస్తుతం బేసిక్ వేతనంలో 12 శాతం పీఎఫ్గా కోత విధించబడుతోంది. అయితే ఈ ఆప్షన్ సోషల్ సెక్యూరిటీ కోడ్ బిల్ 2019లో ఒక ప్రొవిజన్గా ఉంటుందని కేంద్ర కార్మికశాఖ తెలిపింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఈ వారంలోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని వెల్లడించింది.
వినియోగం పెరిగి వృద్ధి కూడా పెరుగుతుందనే అంచనా
పీఎఫ్ తగ్గించుకుని టేక్హోం పేని పెంచడం వల్ల వినియోగం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. వినియోగం పడిపోతుండటం, వృద్ధిరేటు పై ప్రభావం చూపుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే 12శాతం పీఎఫ్ మాత్రం కేంద్రం అలానే ఉంచింది. అయితే పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పై మాత్రం బిల్లు పార్లమెంటులో పాస్ అయ్యాక మాత్రమే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.
కాంట్రాక్టు ఉద్యోగస్తులకు కూడా గ్రాటిట్యూటీ
బిల్లు ప్రకారం, ఒక సమయం వరకు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులందరూ గ్రాటిట్యూటీకి అర్హులు అవుతారు.ప్రస్తుతం ఒకే సంస్థలో ఐదేళ్లు పనిచేసిన కాంట్రాక్టు ఉద్యోగులకు గ్రాటిట్యూటీ ఇవ్వడం లేదు. ఒకే సంస్థలో ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులకు గ్రాటిట్యూటీ యాక్ట్ 1972 ప్రకారం గ్రాటిట్యూటీ చెల్లించాలి. ఇక ఈపీఎఫ్ కింద వచ్చే ఉద్యోగులు నేషనల్ పెన్షన్ స్కీమ్కు మారేలా ఉన్న ప్రొవిజన్కు కేంద్రం గుడ్ బై చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం తీసుకొచ్చిన ప్రొవిజన్ ప్రకారం ఉద్యోగస్తులు అధిక బెనిఫిట్లు పొందుతారని కేంద్రం పేర్కొంది.
సోషల్ సెక్యూరిటీ ఫండ్ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి
ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఈఎస్ఐసీలో ఉన్న స్ట్రక్చర్ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. దీన్ని కార్పోరేట్ పరం చేయాలన్న ఆలోచన లేదని వివరించింది. ఉద్యోగస్తులకు సామాజిక భద్రత కల్పించేలా బిల్లును రూపొందించారు. కార్పరస్ ఫండ్ ద్వారా ఉద్యోగస్తులకు పెన్షన్, మెడికల్ కవర్, డెత్, దివ్యాంగులకు లబ్ధి చేకూరేలా రూపొందించారు. వివాదాస్పదంగా మారుతాయని భావించిన అన్ని ప్రొవిజన్లను తొలగించి ఉద్యోగస్తులకు ఏదైతే లబ్ధి చేకూరుతుందో ఆ ప్రొవిజన్లను మాత్రమే పొందుపర్చినట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.
మొత్తం 44 చట్టాలను 4 కోడ్లుగా విభజన
ఇక ఒక సంస్థలో 10 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారంటే వారందరికి ఈఎస్ఐసీ కింద అన్ని లబ్ధిలు చేకూరాలని బిల్లులో పొందు పర్చినట్లు సమాచారం. ప్రమాదకరమైన రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఇది వర్తించనుంది.ఇక 10 మంది కంటే తక్కువగా ఉన్న సంస్థ వారి ఇష్ట ప్రకారం మేరకు ఇది ఉంటుందని వెల్లడించింది. సోషల్ సెక్యూరిటీ యాక్ట్లో మొత్తం 8 కార్మిక చట్టాలు ఇమిడి ఉన్నాయి. ఇక సంస్కరణలు తీసుకొచ్చే భాగంలో కార్మికశాఖ మొత్తం 44 చట్టాలను నాలుగు కోడ్స్లో విభజించింది. అవి వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, రక్షణ మరియు ఆరోగ్యం, పని పరిస్థితులుగా విభజించింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.