ఆధార్తో 90వేల కోట్ల ఆదా..! ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి..!!
Recommended Video
ఢిల్లీ/ హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ ఆశించిన ఫలితాలను అందిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆధార్ తో అనుసంధానం చేయడం వల్ల దుబారాతో పాటు అవినీతిని అరికట్టగలిగామని కేంద్రం చెబుతోంది. ఆధార్ అను సంధానాన్ని వ్యతిరేకించిన ఇతర రాజకీయ పార్టీలు ఇప్పుడు సమాధానం చెప్పాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.
రాబోవు రోజుల్లో ఇదే ప్రక్రియను మరింత ఉద్రుతం చేస్తామని కూడా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడిస్తోంది. అంతే కాకుండా ఆధార్ అనుసంధానం ద్వారా వచ్చిన మిగులుతో మూడు భారీ పథకాలు అమలు చేయొచ్చని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.
అర్హులైన లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాల సబ్సిడీలను అందించేందుకు తోడ్పడుతున్న ఆధార్తో మూల ధనం గణనీయంగా ఆదా అవుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నకిలీ లబ్ధిదారులు, అనర్హులను ఏరివేయడం ద్వారా గతేడాది మార్చి ఆఖరు దాకా చూస్తే సుమారు 90,000 కోట్లు ఆదా అయినట్లు ఆయన వివరించారు.
'ఆధార్ ప్రయోజనాలు' అంశంపై సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో చేసిన ఒక పోస్టులో ఈ విషయాలు పేర్కొన్నారు.ఆధార్ వినియోగం ద్వారా భారత్ ఏటా 77,000 కోట్లు ఆదా చేసుకోగలదంటూ ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో పేర్కొన్నట్లు ఆయన వివరించారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియను మరిన్ని పథకాలకు అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు.