ప్రియుడితో వీడియో కాల్: హనీషా ఆత్మహత్యకు కారణాలివే
హైదరాబాద్: నగర శివారు కొంపల్లిలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హనీష చౌదరి ఆత్మహత్య కేసులో పోలీసులు మరిన్ని వివరాలను వెల్లడించారు. గత శనివారం రాత్రి కొంపల్లిలోని శివశివానీ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న హనీషా చౌదరి అదే కళాశాలకు చెందిన హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఆత్మహత్యకు ముందు హనీషా తన ప్రేమికుడు దక్షిష్ పటేల్తో వీడియోకాల్లో మాట్లాడింది. వీడియోకాల్లో అతను చూస్తుండగానే ఫ్యాన్కు ఉరేసుకుంది. దీంతో అతడు వెంటనే హాస్టల్ గదికి చేరుకున్నాడు. లోపల గడియపెట్టి ఉండడంతో తలుపులు బద్దలుకొట్టి తెరిచాడు. ఫ్యాన్కు ఉరేసుకున్న హనీషాను అమె స్నేహితురాలి సాయంతో కొంపల్లిలోని సిగ్మా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపే హనీషా ప్రాణాలు కోల్పోయింది.
పెళ్లి చేసుకుందామంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనీషాకు గుజరాత్కు చెందిన దీక్షిత్ పటేల్తో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఆమె గత కొంతకాలంగా కోరుతుండగా, దీక్షిత్ వాయిదా వేస్తూ వస్తున్నాడు.
పెళ్లి ప్రతిపాదన తేగానే..
ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా హనీషా.. దీక్షిత్కు వీడియో కాల్ చేసి మాట్లాడింది. కాసేపు బాగానే మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చింది. దీంతో సరదాగా సాగుతున్న సంభాషణ వాదోపవాదాలకు దారితీసింది. ఇద్దరూ మాటమాటా అనుకున్నారు.
తాను చనిపోతున్నానంటూ..
ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన హనీషా.. ‘నేను చనిపోతున్నాను' అని చెబుతూ.. ఆ వెంటనే ఉరేసుకుంది. ఆమె చేస్తున్న పనిని చూసిన దీక్షిత్.. ఆందోళనకు గురై.. హుటాహుటిన ఆమె హాస్టల్కు చేరుకున్నాడు. స్నేహితురాలి సాయంతో కొంపల్లిలోని సిగ్మా ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హనీషా ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హనీషా ప్రియుడు దీక్షిత్ను పోలీసులు విచారిస్తున్నారు.
కన్నీరుమున్నీరైన తండ్రి.. మంత్రి సునీత పరామర్శ
కాగా, హనీషా తండ్రి అనంతపురంకు చెందిన టీడీపీ నేత బుగ్గయ్య చౌదరి. పోస్టుమార్టం అనంతరం హనీషా మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. కూతురు మృతదేహాన్ని చూసిన బుగ్గయ్య.. కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతపురంకు హనీషా మృతదేహాన్ని తరలించగా, స్నేహితులు, బంధువులు నివాళుర్పించారు. హనీషా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు ఏపీ మంత్రి పరిటాల సునీత. ఆమె కుటుంబసభ్యులను సునీత ఓదార్చారు.