సమసిన సంక్షోభం:శివపాల్ యాదవ్ కు తొలిజాబితాలో సీటు కేటాయింపు
లక్నో :రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత మిత్రులు కాని ఉండరు,సమాజ్ వాదీ పార్టీ సంక్షోభంలో బాబాయ్ పై గుర్రుగా ఉన్న అబ్బాయి కొంత తగ్గినట్టుగా కన్పిస్తున్నాడు. సమాజ్ వాదీ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బాబాయ్ శివపాల్ యాదవ్ కు స్థానం కల్పించాడు. దీంతో సంక్షోభానికి చెక్ పడినట్టేననే అభిప్రాయాన్ని రాజకీయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ సంక్షోభానికి బాబాయ్ శివపాల్ యాదవ్ వైఖరిని కారణంగా అఖిలేష్ వర్గీయులు భావిస్తున్నారు. ఈ మేరకు శివపాల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని ములాయం ను అఖిలేష్ డిమాండ్ చేశారు.
ఎట్టకేలకు పార్టీ తన గుప్పిట్లోకి రావడంతో అఖిలేష్ దే హవా సాగుతోంది. టిక్కెట్ల కేటాయింపు అఖిలేష్ చూసుకొంటున్నాడు. ములాయం సింగ్ కూడ 38 మంది అభ్యర్థుల జాబితాను అఖిలేష్ కు ఇచ్చారు.
శివపాల్ యాదవ్ కు టిక్కెట్టు కేటాయించిన అఖిలేష్ యాదవ్
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి జాబితాను విడుదల చేసింది సమాజ్ వాదీ పార్టీ,. తొలి జాబితాలో 191 మంది అభ్యర్థులను ప్రకటించింది ఆ పార్టీ.ఈ జాబితాలో శివపాల్ యాదవ్ కు చోటు దక్కింది. పార్టీలో సంక్షోభానికి శివపాల్ యాదవ్ కారణమంటూ అఖిలేష్ వర్గీయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.అఖిలేష్ కు మద్దతుగా ఉన్నవారికి టిక్కెట్ల కేటాయింపులో శివపాల్ ప్రాధాన్యత ఇవ్వలేదు. ములాయం సింగ్ విడుదల చేసిన జాబితాలో అఖిలేష్ ను వ్యతిరేకించేవారికి పెద్ద పీట వేశారు.దీంతో పార్టీపై అఖిలేష్ తిరుగుబాటు చేసి తండ్రిపై విజయం సాధించాడు.దీంతో టిక్కెట్ల కేటాయింపు అంశాన్ని తన చేతుల్లోకి తీసుకొన్నాడుఈ మేరకు టిక్కెట్లను ఆయనే కేటాయిస్తున్నాడు. శివపాల్ యాదవ్ కు తొలి జాబితాలో ఆయన స్థానం కల్పించాడు.
కాంగ్రెస్ తో పొత్తు మినహయించి అభ్యర్థులను ప్రకటించిన ఎస్ పి
కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో పెట్టుకొంటుంది సమాజ్ వాదీ పార్టీ. ఈ మేరకు రెండు పార్టీల మద్య సీట్ల ఒప్పందం దాదాపుగా పూర్తైంది. అయితే వంద సీట్లు కేటాయించాలా 85 సీట్లు కేటాయించాలనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. తుది సమాచారం మేరకు వంద సీట్లను కాంగ్రెస్ కు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే కాంగ్రెస్ పార్టీతో పొత్తులో కేటాయించే సీట్లను మినహయించి ఇతర సీట్లలో తన అభ్యర్థులను సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది.
ములాయం సింగ్ జాబితాలో చోటు దక్కనివారికి చోటు
గత నెలలో ములాయం సింగ్ , శివపాల్ యాదవ్ లు కలిసి సుమారు 375 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే ఈ జాబితాలో అఖిలేష్ యాదవ్ వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇవ్వలేదు. మరో వైపు అఖిలేష్ ను బహిరంగంగా వ్యతిరేకించేవారికి ఈ జాబితాలో చోటుకల్పించారు. దీంతో అఖిలేష్ వర్గీయులు తీవ్ర అసహనంతో ఉన్నారు. అఖిలేష్ యాదవ్ కీలక అనుచరులు అతుల్ ప్రధాన్ , అరవింద్ సింగ్ లాంటి వారిని పక్కన పెట్టి తాజా లిస్టును విడుదల చేశారు ములాయం సింగ్ యాదవ్. ఈ మేరకు అఖిలేష్ తాజాగా విడుదల చేసిన జాబితాలో తన వర్గీయులకు పెద్ద పీట వేశాడు.
కుటుంబంలో సమస్యలు లేవని సంకేతాలు పంపిన అఖిలేష్ యాదవ్
కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంకేతాలు పంపారు. తొలి జాబితాలోనే బాబాయికి టిక్కెట్టు కేటాయించడం ద్వారా అఖిలేష్ ఈ సంకేతాలను పంపారు. అమర్ సింగ్ , శివపాల్ యాదవ్ లను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డిమాండ్ చేసిన అఖిలేష్ చివరకు బాబాయికి టిక్కెట్టు కేటాయించారు. ములాయం సింగ్ ఆదేశాల మేరకు జశ్వంత్ సింగ్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని శివపాల్ కు కేటాయించారు.