ఎయిరిండియా విమానంలో ప్రతి ప్రకటన తర్వాత విధిగా ఈ నినాదం చెప్పాలి: సిబ్బందికి ఆదేశాలు
ఢిల్లీ: విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని సిబ్బంది ప్రయాణికులకు పలు సూచనలు చేస్తారు. సీటు బెల్టు పెట్టుకోవాలని, విమానం టేకాఫ్ అయ్యేముందు ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించకూడదంటూ... ఇలాంటివి కొన్ని ప్రకటనలు చేస్తారు. విమానం ల్యాండ్ అవబోతుండగా కూడా అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఇక ఎయిరిండియా విమానయాన సంస్థ తమ సిబ్బందికి కొత్త నిబంధన తీసుకొచ్చింది.
విమానంలో ఇచ్చే ప్రతి అనౌన్స్మెంట్ తర్వాత జైహింద్ అని తప్పనిసరిగా చెప్పాలంటూ కొత్త నిబంధన తీసుకొచ్చిందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇది దేశభక్తిని పెంపొందించడం కోసమే అని వివరించింది. ప్రతి ప్రకటన తర్వాత జైహింద్ అనే నినాదం తక్షణమే అమల్లోకి వస్తుందంటూ ఆపరేషన్స్ డైరెక్టర్ అమితాబ్ విడుదల చేసిన ఆదేశాల్లో ఉంది. ఎయిరిండియా విమానాయాన సంస్థకు ఛైర్మెన్గా బాధ్యతలు స్వీకరించాక అశ్వని లోహానీ కూడా 2016లో ఇదే తరహా ఆదేశాలను జారీ చేశారు.
పైలట్లు తరుచూ ప్రయాణికులతో మైక్రోఫోన్లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలని ప్రయాణం మొత్తంలో కనెక్ట్ అయి ఉండాలని ప్రకటన తర్వాత జైహింద్ నినాదం చేయాలని లోహానీ ఆదేశాలు జారీ చేశారు. ఇలా చేయడం వల్ల దేశభక్తి పెరుగుతుందని అశ్వనీ లోహానీ చెప్పారు. సంప్రదాయం ప్రకారం విమానంలోకి ప్రయాణికులు ఎక్కేసమయంలో దిగే సమయంలో నమస్కారం చేసేవారు. ఇప్పుడు కూడా అదేలా నమస్కారం చేసి చిరునవ్వుతో ప్రయాణికులను పలకరించాలని లోహానీ సూచించారు.