వ్యాపారి బంపరాఫర్: పాకిస్తాన్ ముర్దాబాద్ అంటే డిస్కౌంట్, నిన్న ఢిల్లీ, నేడు చత్తీస్గఢ్
నయారాయపూర్: పుల్వామా తీవ్రవాద దాడిలో నలభై మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దీనిపై భారత్ యావత్తు ఆగ్రహంతో ఉంది. ప్రపంచ దేశాలు ఈ తీవ్రవాద దాడిని ఖండించాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, భారత్పైకి ఉసిగొల్పుతున్న పాక్ను దెబ్బతీయాలని భారతీయులు కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది.
ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై ఆగ్రహంగా ఉన్న ఓ వ్యాపారి దాయాది దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే రూ.10 ఆఫర్ ఇస్తున్నారు. ఈ మేరకు అతను తన దుకాణం ముందు బోర్డు పెట్టారు. ఈ ఆఫర్ వినియోగదారుల్ని ఎంతో ఆకట్టుకుంటోంది. ఛత్తీస్గఢ్లోని జగ్దల్పూర్లోని రోడ్డు పక్కన ఓ ఫుడ్ స్టాల్ ఉంది. ఆ ఫుడ్ స్టాల్ను అంజల్ సింగ్ అనే వ్యక్తి నడుపుతున్నారు.
పాకిస్తాన్ ముర్దాబాద్ అంటే ఫుడ్ ఐటం పైన రూ.10 డిస్కౌంట్ అని ప్రకటించారు. పాకిస్తాన్ మానవీయతకు విలువ ఇవ్వదని, అందుకే ప్రతి ఒక్కరి లోతుల్లో నుంచి పాకిస్తాన్ ముర్దాబాద్ అని నినాదం రావాలని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్లో వైరల్గా మారాయి.
గతంలో ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి కూడా ఇలాంటి ఆఫర్ ఇచ్చారు. పాకిస్థాన్ ముర్దాబాద్ అంటే రూ.1100కే మూడు జతల షూలు అని ఆఫర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మూడో రోజుల క్రితం.. సోమవారం ఇమ్రాన్ ప్రతాప్గర్తి అనే ఉర్దూ కవి తన ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అయింది.