యుద్ధమే శరణ్యమా?.. 'సే నో టు వార్'.. ఇరుదేశాల్లో ఇదే ట్రెండ్
ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి దరిమిలా చోటుచేసుకున్న పరిణామాలు.. సరిహద్దుల్లో యుద్ధవాతావరణం తలపిస్తున్నాయి. పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన దాడిచేసిన ఘటనతో ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే యుద్ధం వస్తే ఎలా ఉంటుందోనని రెండు దేశాల ప్రజలు టెన్షన్ పడుతున్నారు. యుద్ధం రాకూడదని కోరుకుంటున్నారు. ఆ క్రమంలో బుధవారం నాడు ట్విట్టర్ లో.. #SayNoToWar హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది.
యుద్ధమంటూ మొదలైతే అది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో ఊహించలేమని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే.. నా చేతుల్లో గానీ, మోడీ చేతుల్లో గానీ ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు. అదలావుంటే ఇరు దేశాలకు చెందిన నేతలు తాజా పరిణామాలపై ప్రకటనలు చేస్తుండటంతో.. రెండు దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా యుద్ధం వద్దని కోరుకుంటున్నారు.