ఆహా.. ఏం చాన్స్ : కార్డు పెట్టకుండానే.. నోట్లు వెదజల్లుతున్న ఏటీఎం
ముంబైలో భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన ఓ ఏటీఎం.. కార్డు పెట్టకుండానే నోట్లు వెదజల్లుతోంది. ఈ ఘటనపై ఎస్బీఐ ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశించింది. ఇలాంటి ఏటీఎంలు మొత్తం పది వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
ముంబై: భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన ఓ ఏటీఎం.. కార్డు పెట్టకుండానే నోట్లు వెదజల్లుతుండడంపై ఎస్బీఐ ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశించింది. ఈ ప్రాంతంలోని వివిధ బ్యాంకులకు చెందిన పది ఏటీఎంలు ఇలా కార్డు పెట్టకుండానే నగదు వెదజల్లుతుండగా వాటిలో ఇదొకటి.
ఈ ఏటీఎంలలో అవుట్ డేటెడ్ సాఫ్ట్వేర్ ఉపయోగించడంతో స్థానిక హ్యాకర్లు వీటిని హ్యాక్ చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం ఫోరెన్సిక్ ఆడిట్ నడుస్తోందని, సాఫ్ట్వేర్ మాల్ఫంక్షన్ కారణమైన ఉండొచ్చని భావిస్తున్నామని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ నెలాఖరుకు ఆడిట్ను పూర్తి చేసిన నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. ల్యాప్టాప్, ఫోన్ మాల్వేర్ ఎటాక్ తరహాలో ఎస్బీఐ ఏటీఎంపై వైరస్ ఎటాక్ జరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. యూఎస్బీ పోర్టు ద్వారా పైల్స్, వైరస్ను బదిలీ చేయడం వల్ల ఏటీఎంలు ఇలాఅసాధారణంగా పనిచేస్తాయని పేర్కొంటున్నారు.
పది ఏటీఎంలు ఎటాక్కు గురైనట్టు ప్రాథమికంగా సమాచారం అందిందని ఎన్సీఆర్ కార్పొరేషన్ భారత్, దక్షిణాఫ్రికా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ నవ్రోజ్ దస్తుర్ తెలిపారు. ఏటీఎంల విక్రయం, నిర్వహణను ఈ సంస్థే చూస్తుంటుంది.