ఎస్బీఐ ఖాతాదారులకు వూరట, ఆ ఖాతాల్లో కనీస నిల్వ లేకపోయినా చార్జీ ఉండదు, కావాలంటే మార్చుకోండి
కనీస నిల్వలపై ఛార్జీ విషయంలో ఎస్బీఐ స్పష్టతనిచ్చింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి జన్ధన్ యోజన, చిన్న పొదుపు ఖాతాలు, ప్రాథమిక పొదుపు డిపాజిట్ ఖాతాలకు నెలవారీ కనీస నిల్వ నియమం వర్తించదని తెలిపింది.
న్యూఢిల్లీ: కనీస నిల్వలపై ఛార్జీ విషయంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్పష్టతనిచ్చింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి జన్ధన్ యోజన (పీఎంజేడీవై), చిన్న పొదుపు ఖాతాలు, ప్రాథమిక పొదుపు డిపాజిట్ ఖాతా(బీఎస్బీడీ)లకు నెలవారీ కనీస నిల్వ నియమం వర్తించదని తెలిపింది.
కనీస నిల్వ లేకపోయినా, ఈ ఖాతాల నుంచి ఎలాంటి రుసుములూ వసూలు చేయబోమని పేర్కొంది. మొత్తం ఎస్బీఐకు 40 కోట్ల పొదుపు ఖాతాదారులు ఉండగా, సుమారు 13 కోట్ల మంది వూరట లభించినట్లయింది.
అంతేకాదు, ప్రస్తుతం ఎస్బీఐలో పొదుపు ఖాతాలు ఉన్న వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుములు చెల్లిచకుండా తమ ఖాతాలను ప్రాథమిక పొదుపు డిపాజిట్ ఖాతాకు మార్చుకోవచ్చని కూడా వెల్లడించింది.
పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ లేకపోతే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఛార్జీ వసూలు చేస్తుందంటూ ఇటీవల కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.