నోట్ల రద్దు: ఎస్బీఐలో రూ. లక్ష కోట్లకు మించిన డిపాజిట్లు
ముంబై: నల్లధనం, నకిలీ కరెన్సీని నిర్మూలించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8న రాత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేసిన నేపథ్యంలో పలు బ్యాంకుల్లో భారీగా డబ్బులు డిపాజిట్లుగా చేరిపోతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనైతే ఇది ఇంకా అధిక మొత్తంలో ఉంది.
కేవలం ఏడు రోజుల్లో రూ.1,14,139 కోట్ల డిపాజిట్లు జరిగినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడు రోజుల్లో 240.90 లక్షల నగదు డిపాజిట్ల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది.
నవంబర్ 8న ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేశారు. నవంబర్ 10 నుంచి బ్యాంకులు లావాదేవీలు జరిపాయి. డిపాజిట్లపై పరిమితి లేకపోవడంతో భారీ మొత్తంలో జమ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే 14వ తేదీన గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయలేదు. నవంబర్ 10వ తేదీ నుంచీ రూ.500 రూ.1,000 నోట్ల పాత నోట్ల మార్పిడి విలువ రూ.5,776 కోట్లు.
రూ.18,665 కోట్ల విత్డ్రావల్స్ జరిగాయి. ఇందుకు సంబంధించి లావాదేవీల సంఖ్య 151.93 లక్షల కోట్లు. రోజుకు రూ.4,500కు సమానమైన రూ.500, రూ.1,000 నోట్ల మార్పిడికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏటీఎంల్లో నగదు ఉపసంహరణల పరిమితి రోజుకు రూ.2,500. ఏటీఎం విత్డ్రావల్స్ సహా స్లిప్ లేదా చెక్ ద్వారా వారానికి రూ.24,000 విత్డ్రాయల్స్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కాగా, బ్యాంకింగ్లో భారీ డిపాజిట్లపై అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- మూడీస్ తాజాగా స్పందించింది. విత్డ్రాయల్ నిబంధనలు సడలించిన వెంటనే బ్యాంక్ డిపాజట్లు బారీగా పడిపోతాయని పేర్కొంది. డిపాజిట్ల జోరు మరో 3-4 వారాలు కొనసాగుతుందని అంచనా వేసింది. గత వారం రోజుల్లో రూ.4 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు కావడం గమనార్హం.