మధ్య తరగతికి ఎస్బిఐ షాక్: రుణాలపై వడ్డీ రేట్ల పెంపు..
న్యూఢిల్లీ: ఓవైపు కేంద్రం 'అచ్చే దిన్' అంటూ ప్రచారం సాగిస్తుంటే.. బ్యాంకుల తీరు మాత్రం సామాన్యుడి నడ్డి విరిచేలాగే ఉంది. ఇప్పటికే డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఎస్బిఐ తాజాగా రుణాలపై కూడా వడ్డీ రేట్లను పెంచింది.
ఆర్బీఐ షాక్: ఇక మీ పేటీఎం, మొబిక్విక్ పనిచేయకపోవచ్చు?..
వడ్డీరేట్లను 7.95శాతం నుంచి 8.15శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ, వాహన తదితర రుణాలకు ఇది వర్తిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులే వడ్డీ రేట్లనే పెంచుతుండటంతో.. నిండా నష్టాల్లో మునిగిన పంజాబ్ నేషనల్ వంటి ప్రైవేటు బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచేశాయి.
పెరిగిన వడ్డీ రేట్లను ఈఎంఐల రూపంలో ఖాతాదారులు భరించాల్సి ఉంటుంది. కాగా, మధ్య తరగతిపై వడ్డీ రేట్ల పెంపు తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఎస్బిఐ నోటిఫికేషన్ ప్రకారం.. గతేడాది ఏప్రిల్, 2016లో కొత్త రుణ పాలసీని అమల్లోకి తెచ్చాక మొదటిసారిగా వడ్డీ రేట్లను (మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్స్) పెంచినట్టు చెబుతున్నారు. పెరిగిన వడ్డీ రేట్లు మార్చి 1,2018నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇదిలా ఉంటే, నీరవ్ మోడీ కుంభకోణంతో కుదేలైన పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా వడ్డీ రేట్లను పెంచింది. 8.15శాతం ఉన్న ప్రస్తుత వడ్డీ రేట్లను 8.30శాతానికి పెంచింది.
రుణాలు ఇవ్వడంలోనూ, డిపాజిట్ల విషయంలోనూ అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థను కలిగి ఉన్న ఎస్బిఐ.. పెద్ద మొత్తంలో డిపాజిట్లపై 0.75శాతం వడ్డీ రేట్లను పెంచింది. ఇక రూ.1కోటి కన్నా తక్కువ రిటైల్ డిపాజిట్లపై 0.50శాతం మేర వడ్డీ రేట్లను పెంచింది.