ఎస్బీఐ ఖాతాదారులకు చేదువార్త: రుణ వడ్డీరేటు పెంపు, నేటి నుంచే అమలు
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీరేట్లను స్వల్పంగా పెంచింది. గృహ, వాహన, ఇతర రుణాలపై ఈ భారం పడనుంది. ఈ మేరకు 0.2శాతం వడ్డీ రేటును పెంచుతున్నట్లు శనివారం ఎస్బీఐ అధికారులు తెలిపారు.
పెంచిన ఈ రేట్లన్నీ శనివారం(సెప్టెంబర్ 01) నుంచి అమలు కానున్నాయి. దీంతో ఎస్బీఐ ఉపాంత నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) 8.1శాతానికి చేరింది. దీంతో గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి.
మూడేళ్ల కాలపరిమితి కలిగిన అన్ని రుణాలపైనా 20 బేసిన్ పాయింట్లను ఎస్బీఐ పెంచింది. దీంతో ఏడాది కాలపరిమితి గల రుణాలపై వడ్డీ రేటు 8.25శాతం నుంచి 8.45శాతానికి పెరిగింది.
మూడేళ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై 8.45శాతం నుంచి 8.55శాతానికి చేరింది. గత నెలలో ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష సందర్భంగా రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వడ్డీరేటు పెంచినట్లు తెలుస్తోంది.