ఎస్బీఐ న్యూ ఇయర్ కానుక: వడ్డీ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: నూతన సంవత్సర కానుకగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు శుభవార్త అందించింది. రుణాలపై వడ్డీ రేటును 30 బేస్ పాయింట్లు తగ్గించింది. ఈ మేరకు తన వెబ్సైట్లో బ్యాంక్ పేర్కొంది. 2018 జనవరి 1 నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది.
8.95 శాతంగా ఉన్న వడ్డీరేటును 8.65 శాతానికి తగ్గించినట్లు ఎస్బీఐ పేర్కొంది. 2016 ఏప్రిల్కు ముందు బేస్ రేట్ ఆధారంగా రుణాలు తీసుకున్న వారికి ఈ తగ్గింపు వర్తిస్తుంది. బేస్ రేట్ ఆధారంగా గృహ, విద్యా రుణాలు తీసుకున్న వారికి ఉపశమనం కలుగుతుంది.
చివరి సారిగా గతేడాది సెప్టెంబర్లో 9 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8.95 శాతానికి తగ్గించింది. 2016 ఏప్రిల్ తర్వాత రుణాలు తీసుకున్న వారికి నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) వర్తిస్తుంది. అంటే అంతకుముందు బేస్ పాయింట్లు ఆధారంగా రుణాలు తీసుకున్న వారికి ఈ తగ్గింపు వర్తిస్తుంది.