ఎస్బిఐ వినియోగదారులకు శుభవార్త: తగ్గిన మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్
సేవింగ్ అకౌంట్లో కనీస నగదు నిల్వ నిర్వహణ అంశాన్ని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బిఐ) మరోసారి సమీక్షించింది. కనీస నగదు నిల్వలతో పాటు, ఆయా ఖాతాలపై విధించే రుసుములను సవరించింది.
న్యూఢిల్లీ/ముంబై: సేవింగ్ అకౌంట్లో కనీస నగదు నిల్వ నిర్వహణ అంశాన్ని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బిఐ) మరోసారి సమీక్షించింది. కనీస నగదు నిల్వలతో పాటు, ఆయా ఖాతాలపై విధించే రుసుములను సవరించింది.
మెట్రో, పట్టణాల్లో రూ.3వేలకు తగ్గింపు
మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని ఖాతాల్లో కనీస నగదు నిల్వను రూ.5 వేల నుంచి రూ.3 వేలకు తగ్గించింది. దీని వల్ల ఐదు కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. నగదు నిర్వహించని ఖాతాలకు విధించే రుసుములను కూడా 20-50 శాతం మేర సవరించింది.
అక్కడ ఇలా
అర్బన్, సెమీ అర్బన్, రూరల్ కేంద్రాల్లో రూ.3 వేలు, రూ.2 వేలు ఉంది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో చార్జీలను ఆయా ఖాతాలను బట్టి రూ.20-40, మెట్రో, పట్టణ ప్రాంతాల్లో రూ.30-50 వరకు విధించింది. అక్టోబర్ నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.
ప్రభుత్వ పథకాలకు, జన్ ధన్ ఖాతాలకు పరిమితి లేదు
ఇక, జన్ధన్ ఖాతాలకు కనీస నగదు నిల్వల పరిమితి లేదు. తాజాగా పెన్షనర్లు, ప్రభుత్వ ప్రయోజనాలు పొందే ఖాతాదారులు, మైనర్ల ఖాతాలకు నిల్వ అవసరం లేదని వెల్లడించింది.
అసంతృప్తి నేపథ్యంలో
మొత్తం ఖాతాల్లో 13 కోట్లు పీఎంజేడీవై, సాధారణ పొదుపు ఖాతాలు ఉన్నాయి. వీటిని ఇంతకు ముందే ఛార్జీల నుంచి మినహాయించారు. మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో ఖాతాదారుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుండడంతో కనీస నిల్వల పరిమితిని తగ్గించింది.