ఖాతాదారులకు ఎస్ బి ఐ మరో షాక్, టర్మ్ డిపాజిట్ల వడ్డీరేట్లలో భారీగా కోత
ఎస్ బి ఐ మరో షాకిచ్చింది ఖాతాదారులకు,. టర్మ్ డిపాజిట్లపై భారీగా వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని రకాల డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తూ ఎస్ బి ఐ నిర్ణయం తీసుకొంది.
ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు మరో షాకిచ్చింది. టర్మ్ డిపాజిట్ల రేట్లపై భారీ కోత పెట్టింది. మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ డిపాజిట్ల రేట్లను సమీక్షించింది ఎస్ బీ ఐ.
ఈ మేరకు కోటి రూపాయాలలోపు డిపాజిట్ల మెచ్యూరిటీపై చెల్లించే వడ్డీరేటులో 50 బేసిక్ పాయింట్లు తగ్గించి 6.25 శాతంగా నిర్ణయించింది. ఏప్రిల్ 29, 2017 నుండి ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్టు ఎస్ బీ ఐ అధికారికరంగా ప్రకటించింది.
కొత్త నిబంధనల ప్రకారం ఒక కోటి రూపాయాలలోపు డిపాజిట్లపై ఎస్ బి ఐ 6.75 శాతంతో పోలిస్తే 6.25 శాతం వడ్డీని అందించనుంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఏడు రోజుల నుండి రెండు సంవత్సరాల మధ్య ఉండే స్వల్పకాలిక డిపాజిట్లకు చెల్లించే వడ్డీ రేటును మాత్రం యథాతథంగా ఉంచింది. అలాగే సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటుపై కూడ కోత పెట్టింది.
ఇప్పటిదాకా 7.25 శాతంగా ఉన్న ఈ రేటును 6.75 శాతంగా నిర్ణయించింది. మూడేళ్ల నుండి పదేళ్ళలోపు ఉన్న టర్మ్ డిపాజిట్లపై 25 బేసిక్ పాయింట్లను తగ్గించి 6.50 శాతంగా ఉంచింది. సంవత్సరం నుండి 458 రోజుల డిపాజిట్లపై 6.90 శాతం అత్యధిక రేటును అందిస్తోంది. ఎస్ బి ఐ నిధుల అధారిత రుణరేట్లను మార్చలేదు. వార్షిక ఎంసిఎల్ఆర్ ఎనిమిది శాతంగా ఉంది.