సామాన్యుడి మీద బ్యాంకుల దండయాత్ర: స్టేట్ బ్యాంకు కూడా బాదేయనుంది..
ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ లేకపోతే ఇకనుంచి బాదుడు తప్పదని స్టేట్ బ్యాంక్ తాజాగా ప్రకటించింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
ముంబై: బ్యాంకులన్ని వరుసబెట్టి మోత మోగిస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా నోట్ల రద్దుతో గగ్గోలు పెట్టిన సామాన్యుడు ఇప్పుడు బ్యాంకుల బాదుడుకు బెంబేలెత్తిపోయే పరిస్థితి తలెత్తింది. ఓవైపు ప్రైవేటు బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా సర్వీస్ చార్జీలు పెంచేస్తామని ప్రకటనలు ఇస్తుంటే.. ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ కూడా ఇప్పుడు వాటికి జతకలిసింది.
ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ లేకపోతే ఇకనుంచి బాదుడు తప్పదని స్టేట్ బ్యాంక్ తాజాగా ప్రకటించింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. తాజా నిబంధనల ప్రకారం ఇకనుంచి మెట్రో పాలిటన్ నగరాల్లో అయితే కనీసం రూ.5వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.3వేలు, సెమీ అర్బన్ రూ.2వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1వెయ్యి చొప్పున ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీ తప్పదని స్టేట్ బ్యాంక్ హెచ్చరిస్తోంది.
ఖాతాల్లో ఉన్న నిల్వకు, కనీస మొత్తానికి మధ్య ఉన్న తేడాను బట్టి పెనాల్టీ విధిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. ఈ లెక్కన మెట్రోపాలిటన్ నగరాల్లో రూ.3750 (75%)కంటే తక్కువ ఉంటే వంద రూపాయలు, దానిపై సేవాపన్ను విధిస్తారు. అదే 50-75శాతం మధ్య అయితే 75రూపాయలు, దానిపై సేవాపన్ను పడుతుంది.
సగం కన్నా తక్కువగా ఉంటే రూ.50, సేవాపన్ను కలిపి పెనాల్టీగా విధిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ లేకపోతే 25-50శాతం పెనాల్టీతో పాటు, సేవాపన్ను బాదుడు తప్పదు.
బ్యాంకు లావాదేవీలపై కూడా బాదుడే:
సంబంధిత బ్రాంచిలో నెలకు మూడు సార్లు కన్నా ఎక్కువ లావాదేవీలు జరిపితే ఇకనుంచి ఛార్జీలు చెల్లించుకోక తప్పదు. అయితే ఎంత పరిమితికి ఎంత ఛార్జీ చేస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు. గతంలోను బ్యాంకు నగదు లావాదేవీలపై ఛార్జీలు ఉండేవని, వాటిని ఏప్రిల్ 1 నుంచి పునరుద్దరిస్తున్నామని బ్యాంకు అధికారులు తెలిపారు.
కాగా, స్టేట్ బ్యాంకు ఏటీఎం నుంచి నెలకు 10సార్లు ఉచితంగా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉన్నందునా కస్టమర్లు బ్రాంచికి రావాల్సిన అవసరమే ఉండదన్నారు.