ఆరుషి హత్యకేసు: తల్వార్ దంపతుల విడుదలపై విచారణ చేయనున్న సుప్రీంకోర్టు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో జైలు నుంచి విడుదలైన ఆమె తల్లిదండ్రులకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. వారిని కింది కోర్టు విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను విచారణ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. సీబీఐ పిటిషన్తో పాటు వారింట్లో పనివాడిగా ఉన్న హేమ్ రాజ్ హత్య పిటిషన్ను కూడా విచారణ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. 2008 మే 17న హేమరాజ్ మృతదేహాన్ని అధికారులు కనుగొన్నారు. దీనిపై తల్వార్ దంపతులపై సుప్రీంకోర్టులో హేమరాజ్ భార్య పిటిషన్ వేశారు. గతేడాది అక్టోబర్లో విడుదలైన రాజేష్ తల్వార్, నుపూర్ తల్వార్ దంపతులకు సుప్రీం కోర్టు నోటీసులు కూడా పంపింది.
గతేడాది అక్టోబర్ 12న అలహాబాద్ హైకోర్టు ఆరుషి హత్యకేసులో తల్వార్ దంపతులు నిర్దోషులుగా పేర్కొంటూ వారిని విడుదల చేసింది. సీబీఐ సరైన రుజువులు చూపకపోవడం, ఆపై తల్వార్ దంపతులకు సీబీఐ కోర్టు జీవితకాల శిక్ష విధించడం సరికాదని పేర్కొంటూ అలహాబాద్ కోర్టు తల్వార్ దంపతులను నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. హైకోర్టు చెప్పిన తీర్పుతో 4 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారు విముక్తులయ్యారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో సీబీఐ అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జూన్ 1,2008లో సీబీఐ ఆరుషి హత్యకేసుకు సంబంధించి విచారణ ప్రారంభించింది. డిసెంబర్ 29న ఒక నివేదిక సమర్పించింది. ఈ రెండు హత్యలతో ఆ ఇంట్లో పనిచేసే సిబ్బందికి ఎవరికీ సంబంధం లేదని చెబుతూనే ఆరుషి తల్లిదండ్రులైన రాజేష్, నుపూర్లపై అనుమానం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 9, 2011లో సీబీఐ నివేదిక ప్రకారం తల్వార్ దంపతులను విచారణ చేయాల్సిందిగా చెబుతూనే... సాక్షాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినందుకు వారిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా కోర్టు చెప్పింది.
నవంబర్ 26, 2013లో రాజేష్ నుపూర్ తల్వార్ దంపతులును ఆరుషితో పాటు పనిమనిషి హేమరాజ్ను కూడా వీరే హత్య చేశారని కోర్టు భావించి వారికి జీవితకాలం కారాగార శిక్ష విధించింది. ఆరుషితో పనిమనిషి సంబంధం పెట్టుకున్నాడన్న ఆవేశంలో ఆమెను హేమరాజ్ను తల్వార్ దంపతులు హత్య చేశారని సీబీఐ కోర్టు తీర్పు చెబుతూ వారికి శిక్ష విధించింది.