సాధువు బంగారం నిధి కల: తవ్వకాలు ప్రారంభం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లా దౌండియా ఖేరా గ్రామంలోని ఓ కోట కింద వెయ్యి టన్నుల బంగారం ఉందన్న సాధువు కల ఆధారంగా శుక్రవారం పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలను ప్రారంభించారు. ఉదయం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం తవ్వకాలను ప్రారంభించారు. కాగా ఈ తవ్వకాలు కోర్టు పర్యవేక్షణలో చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే పిటిషన్పై వాదనలను సోమవారం వింటామని కోర్టు పేర్కొంది.
కాగా పిటిషనర్ వాదనలను అత్యవసరంగా వినడం సాధ్యం కాదని న్యాయమూర్తి సదాశివం ఆధ్వర్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. పిటిషన్లో లోపాలున్నట్లు వాటిని సరిచేసిన తర్వాతనే తమను ఆశ్రయించాలని, వచ్చే వారం వాదనలను వింటామని కోర్టు తెలిపింది. చాలా విలువైన వనరులను కాపాడుకోవాలంటే తవ్వకాలను కోర్టు పర్యవేక్షణలోనే చేపట్టాలని ఎంఎల్ శర్మ తన పిటిషన్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం తవ్వకాల పర్యవేక్షణను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని కోర్టు తెలిపింది.
180ఏళ్ల క్రితం దౌండియా ఖేరా గ్రామంలో రాజారామ్ భక్ష్ సింగ్ శివాలయంను నిర్మించారు. ఆ ఆలయం సరిసర అడుగు భాగంలో వెయ్యి టన్నుల బంగారం నిధి ఉందని స్వామి శోభన్ సర్కారు చెప్పారు. ఆలయంలో బంగారం నిక్షిప్తమై ఉన్నట్లు తనకు కల వచ్చిందని శోభన్ సర్కారు పేర్కొన్నాడు. అంతేగాక ఈ నిధిని వెలికితీయాలని ప్రధానమంత్రి, రిజర్వు బ్యాంకుకు ఆయన లేఖలు రాశారు. ఈయకు ఆ ప్రాంతంలో సత్యమే మాట్లాడతారనే మంచి పేరుండడంతో అక్కడి ప్రజలందరూ ఆయన మాటలను నమ్మారు.
కేంద్రమంత్రి చరణ్ దాస్ మహంత్ను తన కల నిజమవుతుందని, తవ్వకాలు చేపట్టాలని శోభన్ సర్కారు కోరారు. కేంద్ర మంత్రి ఆదేశాలతో పురావస్తు శాఖ అధికారులు శుక్రవారం తవ్వకాలను ప్రారంభించారు. బంగారం నిధి ఉందని తెలియడంతో పరిసర గ్రామాల ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల్లోని ప్రజలు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. స్వామి చెప్పిన బంగారం నిధి ఉంటే అది సుమారు 3లక్షల కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా బంగారం నిధి ఉందన్న వార్తలతో ఈ ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా వెలుగులోకి గమనార్హం.