భారత్లో ఆఫ్రికన్ జాతి చిరుతపులులకు సుప్రీం లైన్ క్లియర్.. అక్కడ వదలాలని ఆదేశం
న్యూఢిల్లీ: ఆఫ్రికా జాతి చిరుతపులులను భారత్లో ఉంచేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆఫ్రికా జాతి చిరుతపులులకు సరైన ఆవాసాలుగా ఉండే అడవులను గుర్తించి అక్కడ వాటిని వదిలేయాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. భారతదేశంలో చిరుత పులులు అంతరించిపోతున్న నేపథ్యంలో జాతీయ పులుల సంరక్షణా సంస్థ (NTCA) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నమీబియా నుంచి ఆఫ్రికన్ చిరుత పులులను భారత్కు తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానంను ఆశ్రయించింది.
చిరుత పులుల ఆవాసం కోసం కమిటీ వేసిన సుప్రీంకోర్టు
NTCA పిటిషన్ మేరకు సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. ఇందులో వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ రంజిత్ సింగ్, వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా డీజీ ధనంజయ్ మోహన్, కేంద్రపర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖలో డీఐజీని సభ్యులుగా నియమించింది. NTCAకు సూచనలు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక కేసును విచారణ చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లు ఈ ప్రాజెక్టును తామే స్వయంగా పర్యవేక్షిస్తామని చెప్పారు. అంతేకాదు ప్రతి నాలుగు నెలలకోసారి కమిటీ నివేదికను తమ ముందు ఉంచుతుందని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.
మధ్యప్రదేశ్లోని నౌరదేహీ అటవీప్రాతం సూచించిన కమిటీ
సరైన సర్వే నిర్వహించాకే ఆఫ్రికన్ జాతి చిరుతపులులను భారత్లోకి ప్రవేశింప చేయాలా వద్ద అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పింది. తమ నిర్ణయం వెల్లడించిన తర్వాతే NTCA ఇష్టం మేరకు వ్యవహరించే అవకాశం కల్పించింది. అయితే ఆఫ్రికన్ జాతి చిరుతపులులు ఉండేందుకు ఏ అటవీ ప్రాంతం అయితే అనుకూలిస్తుందో దానిపై పూర్తిగా సర్వే చేయాల్సిన బాధ్యతను త్రిసభ్య కమిటీకి అప్పగించింది సుప్రీంకోర్టు. అయితే ఆఫ్రికన్ జాతి చిరుత పులులు భారత్లోని వాతావరణంకు అలవాటు పడేలా ఏ అటవీ ప్రాంతమైతే సరిగ్గా సరిపోతుందో అనేదానిపై సర్వే చేసి నివేదిక అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచింది. మధ్యప్రదేశ్లోని నౌరదేహీ వన్యప్రాణుల సంరక్షణా కేంద్రంలో ఆఫ్రికన్ జాతి చిరుత పులులను ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని త్రిసభ్య కమిటీ నివేదికలో పొందుపర్చింది.
1952లో అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చిరుత
ఇక ఆఫ్రికా జాతి చిరుత పులులు నౌరదేహీ అభయారణ్యంలో ఉంచేందుకు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేటివ్ ఆఫ్ నేచర్ సంస్థ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సంస్థ బయోడైవర్శిటీ, వాతావరణ మార్పులు స్థిరవృద్ధిలపై ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ సంస్థలకు ఇన్పుట్స్ ఇస్తుంది. ఇదిలా ఉంటే చివరిసారిగా భారత జాతి చిరుతపులి చివరిసారిగా 1947లో కనిపించినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. అనంతరం 1952 నుంచి ఈ జాతి చిరుత పులులను అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చడం జరిగింది.