వినాయక చవితి వేడుకలపై సుప్రీం సంచలనం: కన్సెషన్ ఉండదంటూ: జైన ఉత్సవాలకు ఓకే
న్యూఢిల్లీ: వినాయక చవితి వేడుకలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బహిరంగంగా గణేష్ చతుర్థి ఉత్సవాలను నిర్వహించకూడదంటూ దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలను జారీ చేసిన వేళ.. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు రోజుల పాటు జైన దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు.. గణేష్ చతుర్థి వేడుకలను నిర్వహించుకోవడానికి గానీ, ఏ ఇతర దేవాలయాలను తెరవడానికి నో చెప్పింది.
జైన దేవాలయాలకు వర్తింపజేసిన కన్సెషన్లు.. వినాయక చవితి వేడుకలకు వర్తించబోదని స్పష్టం చేసింది. ఎక్కువ మంది భక్తులు గుమికూడటానికి అవకాశం ఉండటం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. జైనులు పరమ పవిత్రంగా భావించే పర్వ పర్యూషన్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. శని, ఆదివారాలతో ఈ ఉత్సవాలు ముగియబోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చివరి రెండు రోజుల పాటు వేడుకలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి.
ముంబైలోని దాదర్, బైకుల్లా, చెంబుర్లల్లో గల జైన దేవాలయాల్లో ఈ ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ పిటీషన్దారులు విజ్ఙప్తి చేశారు. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డె సారథ్యంలోని ముగ్గురు సభ్యులు ధర్మాసనం విచారణను నిర్వహించింది. వాదనలను విన్న తరువాత అనుకూలంగా తీర్పు వెలువడించింది. పిటీషనర్ల కోరిక మేరకు దాదర్, బైకుల్లా, చెంబుర్లల్లో గల జైన దేవాలయాల్లో పర్యూషన్ వేడుకలను నిర్వహించుకోవచ్చని ఎస్ఏ బొబ్డే తీర్పు ఇచ్చారు.
Recommended Video
ఈ రకమైన కన్సెషన్లు మాత్రం.. ఏ ఇతర దేవాలయానికి గానీ, వినాయక చవితి ఉత్సవాలకు గానీ వర్తించబోవని స్పష్టం చేశారు. దీనికి ప్రధాన కారణం- భారీ సంఖ్యలో భక్తులు ఒకేచోటిెకి గుమికూడే అవకాశం ఉండటమే. వినాయక చవితి పండుగ సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించడానికి గానీ, గణేష్ చతుర్థి వేడుకలకు అనుమతి ఇవ్వడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు ఒకేచోట గుమికూడుతారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు ఈ తరహా వాతావరణానికి అనుకూలంగా లేవని పేర్కొన్నారు. అందుకే- జైన దేవాలయాలను తెరవడానికి ఇచ్చిన తీర్పు.. వినాయక చవితి వేడుకలకు వర్తించబోదని అన్నారు.