ఆర్డర్.. ఆర్డర్... ముప్తీని కలిసేందుకు ఓకే.. ఇలాంతిజాకు పర్మిషన్ ఇచ్చిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబ ముఫ్తీ కూతురు ఇలాంతిజాకు ఊరట లభించింది. తన తల్లిని కలుసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం పర్మిషన్ ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. కశ్మీర్ విభజన తర్వాత జమ్ముకశ్మీర్ లడాఖ్లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో మెహబూబ ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా తదితర నేతలను గృహ నిర్భందంలో ఉంచారు.
నేటి నుంచే జియో ఫైబర్ సేవలు: కనెక్షన్ తీసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో సుందర కశ్మీర్ నివురుగప్పిన నిప్పులా మారింది. సీఆర్పీఎఫ్ బలగాల నీడన భద్రతా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతల వ్యాఖ్యలతో హింస చెలరేగుతుందనే అంచనాతో మాజీ సీఎంలు మెహబూబ ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాను గృహ నిర్బందంలో ఉంచారు. దీంతో తమ తల్లిని కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని మెహబూబ ముఫ్తీ కూతురు ఇలాంతిజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మెహబూబ ముఫ్తీని ఇప్పటికే ఆమె తల్లి, చెల్లి కలుసుకొన్నారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలో ముఫ్తీని కలుసుకొన్నారని కోర్టుకు తెలిపారు. కానీ ఇలాంతిజా పిటిషన్ మాత్రం దురుద్దేశంతో వేశారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఇటు పిటిషనర్ తరఫున నిత్య రామకృష్ణన్ వాదనలు వినిపించారు. గత నెల 22 నుంచి ఇలాంతిజా కూడా ఆంక్షల మధ్య ఉంటున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్రం వదిలి వచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు తల్లిని కలుసుకొనే అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.