గోవధ చట్టంపై సుప్రీం సీరియస్- రద్దు చేయకపోతే స్టే ఇస్తామని కేంద్రానికి హెచ్చరిక
దేశంలో పెరుగుతున్న గోవధను అరికట్టే్ందుకు మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జంతువధ నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ చట్టం అమలు పేరుతో నిందితులపై ఆరోపణలు రుజువు కాకుండానే వారి నుంచి గోవులు లాక్కోవడం, గోశాలలు మూసేయడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
గోవధ చట్టంలో కేంద్రం పొందుపర్చిన నిబంధనలు వాస్తవంగా ఉన్న జంతువధ చట్టంలోని సెక్షన్ 29కు వ్యతిరేకంగా ఉన్నాయని ఛీఫ్ జస్టిస్ ఎస్.ఏ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే తామే దీనిపై స్టే ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. దీంతో కేంద్రం దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి.
2017లో కేంద్ర ప్రభుత్వం జంతువధ చట్టంలో చేసిన మార్పుల తర్వాత కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఇందులో ఏ వ్యక్తి లేదా గోశాలలో ఉన్న గోవులనైనా వధించినట్లు ఆరోపణలు వచ్చినా వారి నుంచి గోవులను స్వాధీనం చేసుకుంటారు. వారి ఆధ్వర్యంలో పని చేస్తున్న గోశాలలు కూడా మూసేస్తారు. అనంతరం నిందితులపై విచారణ జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం కఠిన శిక్షలు కూడా అమలవుతాయి. అయితే నిందితులపై ఆరోపణలు రాగానే వారికి జీవనాథారమైన గోవులను వారి నుంచి స్వాధీనం చేసుకోవడం, గోశాలలు మూసేయడం ద్వారా వారి ఉపాధి దెబ్బతింటుందని సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఈ చట్టం వెంటనే రద్దు చేయాలని కేంద్రానికి సూచించింది.