చౌకీదార్ చోర్ వ్యాఖ్యలతో చిక్కుల్లో రాహుల్ ..వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు నోటీస్
ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. రాఫెల్ కేసుకు సంబంధించి ఆయన చేసిన కామెంట్లను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
సినిమా చూసి నిర్ణయం తీసుకోండి మోడీ బయోపిక్పై ఈసీకి సుప్రీం సూచన
రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కోర్టు
రాఫెల్ కేసు పునర్ సమీక్ష విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని రాహుల్ వక్రీకరించారని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విషయంలో ఆయన జనాన్ని, మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించింది. రాహుల్ చెప్పినట్లుగా కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ వివరణ ఇవ్వాలని కోరింది. ఇందుకు 7రోజుల సమయం ఇచ్చింది.
అమేథీలో చౌకీదార్ చోర్ విమర్శలు
గతవారం అమేథీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రాఫెల్ కేసులో మీడియా వద్ద ఉన్న డాక్యుమెంట్లను సాక్ష్యంగా పరిగణిస్తామన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని ఆయన ప్రస్తావించారు. చౌకీదార్ చోర్ అని సుప్రీంకోర్టు కూడా భావిస్తోందని, అందుకు న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. సత్యాన్ని ఎవరూ మార్చలేరని, ప్రతి ఒక్కరూ కాపలాదారే దొంగ అంటున్నారని మోడీని ఉద్దేశించి రాహుల్ ఆరోపణలు చేశారు.
బీజేపీ కోర్టు ధిక్కరణ పిటీషన్
సుప్రీంకోర్టును ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అంటూ వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. సుప్రీం వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ కోర్టు మెట్లెక్కింది. రాహుల్పై కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.