వారిపై కేసులు ఉపసంహరించుకోండి.. రైళ్ల సంఖ్యను పెంచడి: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ అమలులోకి రావడంతో అత్యంత భారీగా నష్టపోయింది మాత్రం వలస కూలీలే అని చెప్పక తప్పదు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక తినేందుకు తిండి లేక సొంతూళ్లకు కాలినడకనే బయలుదేరారు వలస కూలీలు. తట్టా బుట్టా సర్దుకుని చిన్నపిల్లలను భుజాన వేసుకుని సొంతూళ్లకు బయలు దేరిన వలస కూలీల దీనగాథ అంతా ఇంతా కాదు. వారి ఊళ్లకు చేరేందుకు రైళ్లు లేక ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి వాహనాలు లేక కాలినడకపైనే వెళ్లారు. ఇలా కొన్ని వందల కిలోమీటర్లు నడిచాక తీరా సొంతూరుకు చేరుతారనగా చాలామంది మార్గమధ్యలోనే మృతి చెందారు. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేసి పలు కీలక ఆదేశాలను జారీ చేసింది.
సొంతూళ్లకు చేరుకోలేక ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను 15 రోజుల్లోగా వారి సొంత ఊళ్లకు చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు 24 గంటల్లోగా వలస కూలీలకోసం ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచాలని రైల్వేశాఖకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు సొంతూళ్లకు ఇప్పటికే చేరుకున్న వలస కూలీలకు ఎలాంటి ఉపాధి పథకాలు అమలు చేస్తున్నారో జాబితా తయారు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. బ్లాక్ లేదా జిల్లా స్థాయిలో కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వలస కూలీలకు ఎలాంటి ఉపాధి పథకాలు అమలు చేస్తున్నారో వివరించాలని దాని ద్వారా కలిగే లబ్ధిని చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఇక వలస కూలీలకు ఉపాధి కల్పనపై కూడా సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను కోరింది. ప్రస్తుతం ఉన్న పనులను మానుకుని సొంతూళ్లకు వస్తున్న వారికి ఎలాంటి ఉపాధి కల్పిస్తారో కూడా స్పష్టంగా వివరించాలని న్యాయస్థానం కోరింది. అదే సమయంలో వలస కూలీలు ఇళ్లకు వెళ్లాలన్న ఆలోచనతో నిబంధనలు ఉల్లంఘించి ఉంటే వారిపై నమోదైన కేసులన్నిటినీ ఉపసంహరించుకోవాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం రోజున ఈ ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేసింది.
ఇక వలస కూలీల మృతిపై వారు పడుతున్న కష్టాలను ఇబ్బందులను సుమోటోగా అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. జూన్ 5వ తేదీన విచారణ చేయగా వలస కూలీలను తమ సొంతూళ్లకు పంపేందుకు 15 రోజులు సమయం చాలని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. లాక్డౌన్ అమల్లోకి రావడంతో మార్చి 25 నుంచి వీరు పనిచేస్తున్న సంస్థలు మూతవేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.