అయోధ్య కేసు విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా: తుది విచారణ ప్రారంభం, ఏవరేమన్నారంటే!
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం మీద కేసుపై సుప్రీం కోర్టు తుది విచారణను మంగళవారం ప్రారంభించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ తీర్పు చెప్పనుంది.
అయోధ్య-బాబ్రీ వివాదం: కూల్చివేత నుంచి కూల్చివేత దాకా.. ఇదీ జరిగింది!
2010లో భూ వివాదంపై అలాహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 13 అప్పీళ్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. అంతకుముందు ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు వివాదంలో ఉన్న భూమిని 2.77 ఎకరాల చొప్పున సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖారా, రామ మందిరాలకు కేటాయించాలని తీర్పు చెప్పింది.
సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత విచారణ చేపట్టాలన్నారు. లేదంటే తీర్పు వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్నారు. మరోవైపు తాము అన్ని పత్రాలను సమర్పించామని ఏజీ చెప్పారు.
కపిల్ సిబ్బల్ తన వాదన వినిపిస్తూ.. రామాలయం నిర్మాణం 2014 బీజేపీ మేనిఫెస్టోలో ఉందన్నారు. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశాలున్నందున 2019 జూలై 15 ఎన్నికల తర్వాతే అయోధ్య, బాబ్రీ వివాదంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.
అయిదుగురు లేదా ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం విచారణ జరపాలని కోరారు. తనకు, ఇతర పిటిషనర్లకు సంబంధింత డాక్యుమెంట్లు పంపిణీ చేయలేదన్నారు. ఇంత తక్కువ సమయంలో 19,000 పేజీలకు పైగా డాక్యుమెంట్లను ఎలా ఫైల్ చేశారో తనకు అర్ధం కావడం లేదన్నారు.
సుబ్రమణ్య స్వామికి ఈ కేసులో ఏమాత్రం ప్రమేయం లేనందున ఆయన పిటిషన్ను పరిగణనలోకి తీసుకోరాదని కోర్టును కోరారు. కాగా, వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని షియా వక్ఫ్ బోర్డ్ తరఫు న్యాయవాది ఎం థింగ్రా కోర్టుకు విన్నవించారు. ఈ వివాదంపై విచారణకు దేశంలో అనువైన వాతావరణం నెలకొనలేదని సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. ఆ తర్వాత కాసేపటికి సుప్రీం ప్రత్యేక బెంచ్ 2018 ఫిబ్రవరి 8కి విచారణను వాయిదా వేసింది.