ఆర్టికల్ 370 రద్దు, మీడియా ఆంక్షల పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దును సవాల్ చేస్తూ అడ్వకేట్ ఎంఎల్ శర్మ, కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ బాసిన్ దాఖలు చేసిన పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానం ముందుకొచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్ఏ బోడే, జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్లను విచారిస్తోంది. ఆర్టికల్ 370 రద్దుపై చాలా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలైన ఇవాళ వీరిద్దరు పిటిషన్లపైనే ప్రత్యేక ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్ను రెండు కేంద్రప్రాంత పాలితలుగా విభజించడంపై కూడా సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు జమ్ముకశ్మీర్, లడాఖ్లో కమ్యునికేషన్, మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని కోరారు. అలాగే మీడియాపై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని కోరారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 5న నిర్ణయం తీసుకుంది. ఆ మరునాడు న్యాయవాది శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ అభిప్రాయం తీసుకోకుండా ఆర్టికల్ 370 రద్దుచేయడాన్ని శర్మ తప్పుపట్టారు. జమ్ముకశ్మీర్ విభజన చట్టం అమల్లోకి వచ్చాక ఈ నెల 10న సుప్రీంకోర్టులో బాసిన్ పిటిషన్ దాఖలు చేశారు. కశ్మీర్లో మీడియా ప్రతినిధులకు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు.
మీడియాపై ఆంక్షలు విధించొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1) (ఏ), 19 (1) (జీ), 21 చెప్తుందని పేర్కొన్నారు. మీడియాతోపాటు కశ్మీరీల హక్కులను కేంద్ర ప్రభుత్వం అణగదొక్కిందన్నారు. ఆగస్టు 4 నుంచే కశ్మీర్లో ఏదో జరుగుతుందనే సంకేతాలతో కేంద్ర పక్కా ప్రణాళిక ప్రకారం నడుచుకుందని పేర్కొన్నారు. కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితిపై మంగళవారం దాఖలైన మరో పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కశ్మీర్లో యథాతథ పరిస్థితులు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా .. మరో రెండు వారాల తర్వాత విచారిస్తామని పేర్కొన్నారు. ఇటు మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ కూడా జమ్ము కశ్మీర్ విభజనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అడ్వకేట్ శర్మ, జర్నలిస్టు బాసిన్ వాదనలు .. ప్రభుత్వ తరఫున అటార్నీ జనరల్ వాదనలను ధర్మాసనం అలకించి ... తీర్పును వాయిదా వేసే అవకాశం ఉంది.