శబరిమల అయ్యప్పను దర్శించుకున్నది ఇద్దరు కాదు, 51 మంది మహిళలు: కేరళ ప్రభుత్వం
న్యూఢిల్లీ/తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి గత మూడు నెలలుగా ప్రవేశించిన మహిళల జాబితాను కేరళ ప్రభుత్వం శుక్రవారం నాడు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు అందించింది. మొత్తం 51 మంది మహిళలతో కూడిన జాబితాను కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలోని కౌన్సెల్ కోర్టు ముందు ఉంచింది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి యాభై ఒక్క మంది వెళ్లినట్లు పేర్కొంది.
మరోవైపు, శబరిమల ఆలయంలోకి వెళ్లిన బిందు, కనకదుర్గలకు రక్షణ కల్పించాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎల్ఎన్ రావు, దినేష్ మహేశ్వరిలతో కూడిన సుప్రీం ధర్మాసనం... కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారిద్దరికి నిత్యం భద్రత ఉండాలని చెప్పింది. ఈ ఇద్దరు మహిళలు జనవరి 2వ తేదీన ఆలయంలోకి ప్రవేశించారు.
కాగా, జనవరి 2న శబరిమల ఆలయంలోకి ప్రవేశించి హిందూ సంస్ధల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న ఈ ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందు తమకు 24 గంటల పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కన్నూర్ జిల్లాకు చెందిన వీరిద్దరూ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడాన్ని నిలువరిస్తూ హిందూ సంఘాలకు చెందిన నిరసనకారులు అడ్డుకున్నారు. అయ్యప్ప ఆలయంలోకి తమను అనుమతించాలని డిమాండ్ చేస్తూ వీరు నిరవధిక దీక్షకు దిగడం కలకలం రేపింది.
మరోవైపు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై ఆగ్రహిస్తూ కనకదుర్గపై ఆమె అత్త కర్రతో దాడి చేసింది. దీనిపై ఐపీసీ సెక్షన్ 341, 324 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కాగా అయ్యప్ప ఆలయంలోకి ఇరువురు మహిళలు దుర్గ, బిందులు ప్రవేశించడంతో ఆలయ ప్రధాన పూజారి ఆలయాన్ని మూసివేసి శుద్ధి చేశారు.
మకరజ్యోతి దర్శనం, స్వామియో శరణమయ్యప్ప నినాదాలతో మార్మోగిన శబరిగిరులు
శబరిమల వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటీవల స్పందించారు. స్త్రీ, పురుష సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలకు గౌరవం ఇవ్వాలంటూ వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నాయని, కానీ వారి చేతలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని, ట్రిపుల్ తలాక్ని రద్దు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కానీ కమ్యూనిస్టుల పక్షాలు, కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు.
శబరిమల విషయంలో ఎల్డీఎఫ్ ప్రవర్తన ఎలా ఉందంటే ఓ పార్టీ లేదా ప్రభుత్వం వ్యవహరించిన అతి కిందిస్థాయి తీరుగా చరిత్రలో నిలిచిపోయేలా ఉందని, కమ్యూనిస్టులు భారత చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలను గౌరవించరని మనకు తెలుసునని, కానీ, వారికి వీటి పట్ల ఇంతగా ద్వేషం ఉందని ఎవరూ ఊహించలేదన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ శబరిమలపై చాలా రకాలుగా స్పందిస్తోందని, పార్లమెంటులో ఒకలా మాట్లాడుతోందని, శబరిమల ఉన్న జిల్లాలో ఒకలా మాట్లాడుతోందన్నారు.