కరోనా దోపిడీ- అంబులెన్స్ల తీరుపై సుప్రీం సీరియస్- ఛార్జీలు నిర్ణయించాలని రాష్ట్రాలకు ఆదేశం..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుండగా.. రోగుల నుంచి అంబులెన్స్ల దోపిడీ అంతకు మించి కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో రోగుల అవస్ధలను సొమ్ము చేసుకుంటూ అంబులెన్స్లు భారీ ఎత్తున ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. కరోనా భయాలతో ప్రజా రవాణా వ్యవస్ధ కూడా ఇంకా గాడిన పడకపోవడంతో రోగులకు, వారి బంధువులకూ అంబులెన్స్లే దిక్కవుతున్నాయి. ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్ ఛార్జీలు వసూలు చేస్తూ అంబులెన్స్ల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ రోగులను దోపిడీ చేస్తున్న అంబులెన్స్ల తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. అంబులెన్స్లు వసూలు చేస్తున్న ఛార్జీలపై ప్రాధమిక వివరాలు పరిశీలించిన కోర్టు... పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంబులెన్స్ల దోపిడీపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్ధానం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సూచించింది. కోవిడ్ రోగులు వాడుతున్న అెంబులెన్స్లకు సరసమైన ధరలు నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
కరోనా రోగులకు ఇస్తున్న మెడికల్ ఆక్సిజన్ రవాణాకు రాష్ట్రాల మధ్య అడ్డంకులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం నిన్న కోరింది. మెడికల్ ఆక్సిజన్ సరఫరాకు అంతర్ రాష్ట్ర రవాణాలో అడ్డంకులు ఏర్పడటం వల్ల రోగులు ఇబ్బంది పెడుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చింది. వీటి తర్వాత 24 గంటల్లోనే సుప్రీంకోర్టు అంబులెన్స్లపై ఇచ్చిన ఆదేశాలతో కరోనా రోగులకు భారీగా ఊరట దక్కబోతోంది.