అక్కడ కట్టిన కట్టడాలను తొలగించండి: సుప్రీంకోర్టు తీర్పుతో షాక్కు గురైన బిల్డర్లు
న్యూఢిల్లీ: కేరళలోని ఎర్నాకులంలో ఉన్న కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సిందిగా మరదు మున్సిపాలిటీ శాఖకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోస్టల్ రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించి కట్టిన నిర్మాణాలన్నిటినీ తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. ఒక నెలరోజుల సమయంలో వీటన్నిటినీ తొలగించాల్సిందిగా ఆదేశించింది. అంతేకాదు కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో ఏమైనా నిర్మాణాలు చేపట్టాలంటే కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీతో చర్చించాక వారి అనుమతి తీసుకున్నాకే నిర్మాణాలు చేపట్టాలని కోర్టు ఆర్డర్లో పేర్కొంది.
ఇక ఈ మధ్య కేరళను అతలాకుతలం చేసిన వరదల పై కూడా సుప్రీంకోర్టు నోట్ చేసుకుంది. ఆ సమయంలో కూడా భారీ నష్టం వాటిల్లిందంటే అందుకు కారణం తీరప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలే అని అభిప్రాయపడింది.రాష్ట్ర తీరప్రాంత నిర్వహణ అథారిటీ అక్రమంగా భవనాలను నిర్మిస్తున్న బిల్డర్లకు నోటీసులు పంపింది. ఆ ప్రాంతం కోస్టల్ రెగ్యులేటరీ జోన్ -3 కిందకు వస్తుందని నిబంధనలు అతిక్రమించి కట్టడాలు చేపట్టేందుకు ఎలా అనుమతులు ఇచ్చారో వివరించాలని మున్సిపల్ శాఖను కోరింది. ఎందుకు కూల్చకూడదో కూడా వివరణ ఇవ్వాలని కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రశ్నించింది.
కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన నోటీసులపై బిల్డర్లు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అయితే స్థానిక శాఖలు తాము నిర్మాణం చేసుకునేందుకు అన్ని అనుమతులు ఇచ్చాయని పేర్కొన్నారు.అయితే ఈ కట్టడాలు నిబంధనలను అతిక్రమించేలా ఉన్నాయని కోర్టు భావించినప్పటికీ స్థానిక శాఖలు చేసిన తప్పిదానికి వీరు నష్టపోకూడదని భావించింది.దీంతో కోస్టల్ రెగ్యులేటరీ మేనేజ్మెంట్ అథారిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు సీఆర్జెడ్ ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను కూడా అత్యున్నత న్యాయస్థానం వివరించింది.