దీపావళి బాణాసంచా నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు: ఆ పిటీషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: దీపావళి పండుగ నాడు బాణాసంచాను కాల్చడంసై దాదాపు అన్ని రాష్ట్రాలు నిషేధాన్ని విధిస్తున్నాయి. ఏపీ కూడా ఈ జాబితాలో చేరింది. గ్రీన్ క్రాకర్స్కు మాత్రమే విక్రయించడానికి అనుమతి ఇచ్చింది. దాన్ని కాల్చడంపైనా ఆంక్షలు విధించింది. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే, అదీ గ్రీన్ క్రాకర్స్ను కాల్చడానికి మాత్రమే పచ్చజెండా ఊపింది. అనేక రాష్ట్రాల్లో అదీ లేదు. ఢిల్లీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక ఇప్పటికే బాణాసంచా కాల్చడాన్ని నిషేధించాయి. దీన్ని సవాల్ చేస్తూ ఒకట్రెండు సంఘాలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. పిటీషన్లు దాఖలు అయ్యాయి.
దీపావళి నాడు బాణాసంచాను కాల్చడాన్ని సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ నుంచి ఆ పిటీషన్లు దాఖలు అయ్యాయి. సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం కొద్దిసేపటి కిందటే వాదనలను ఆలకించింది. దీపావళి నాడు బాణాసంచాను కాల్చడం ఆనవాయితీగా వస్తోందని, దానిపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధాన్ని విధించిందని పిటీషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీని వెనుక ప్రభుత్వ దురుద్దేశం ఉందని పేర్కొన్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని విజ్ఙప్తి చేశారు. న్యాయవాది వాదనలతో బెంచ్ ఏకీభవించలేదు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేమని జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. భారత్లో పండుగలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో తమకు తెలుసునని, ప్రజల మనోభావాలను తాము అర్థం చేసుకోగలమని చెప్పారు.
Recommended Video
కరోనా వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినప్పుడు, వారిని కాపాడటానికి చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అలాంటి చర్యలు, నిర్ణయాలను సమర్థించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. బాణాసంచాను కాల్చడాన్ని నిషేధించడానికి వ్యతిరేకంగా దాఖలైన ఈ పిటీషన్ను కొట్టివేస్తున్నట్లు చెప్పారు.