సీబీఎస్ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు షాక్: ఆ పిటీషన్ను కొట్టేసిన సుప్రీం: మోత తప్పనట్టే
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విద్యార్థులకు దేశ అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. తమ పిల్లల సీబీఎస్ఈ పరీక్షల ఫీజుల ఇక అదనపు భారంగా పరిణమించబోతోన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫీజులను మాఫీ చేయాలంటూ సీబీఎస్ఈ విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు కొద్దిసేపటి కిందట కొట్టేసింది. అలాంటి ఆదేశాలను జారీ చేయలేమని స్పష్టం చేసింది.
సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షలు రద్దు: చివరి మూడు పరీక్షల ఆధారంగా మార్కులు..గ్రేడింగ్
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా సుదీర్ఘకాలం పాటు లాక్డౌన్ను ప్రకటించడం వల్ల కోట్లాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అనేక కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. మూడున్నర నెలల పాటు సాగిన లాక్డౌన్ పరిస్థితుల వల్ల పొట్ట నింపుకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాల మధ్య తమ పిల్లలను చదివించుకోలేకపోతున్నామని, ఈ సంవత్సరానికి ఫీజులను మాఫీ చేసేలా సీబీఎస్ఈ అధికారులు, ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేయాలంటూ పలువురు తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ను దాఖలు చేశారు.
దీన్ని ఇదివరకే విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. కొద్దిసేపటి కిందటే ఈ పిటీషన్పై వాదోపవాదాలను ఆలకించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరానికి సీబీఎస్ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజులను మాఫీ చేయాలంటూ పేరెంట్స్ కమిటీ ప్రతినిధుల తరఫు న్యాయవాది విజ్ఙప్తి చేశారు. ఈ పిటీషన్పై మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Recommended Video
అనేక కుటుంబాలు ఫీజులను చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాయని, వాటిని మాఫీ చేసేలా సీబీఎస్ఈ, ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేయాలని కోరారు. కరోనా వల్ల తరగతులను కూడా నిర్వహించట్లేదని, ఆన్లైన్ క్లాస్లపైనే విద్యార్థులు ఆధాకపడ్డారని అన్నారు. ఈ ఒక్క విద్యా సంవత్సరానికి ఫీజులను మాఫీ చేయడం వల్ల పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక వెసలుబాటును కల్పించినట్టవుతుందని చెప్పారు ఈ వాదనలో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. పిటీషన్ను కొట్టేస్తున్నట్లుగా చెప్పారు.