‘సంపూర్ణ గోవధ నిషేధం’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
దేశంలోని అన్ని రాష్ట్రాలలో గోవధను సమూలంగా నిషేధించాలని, కబేళాలు ఎత్తేసేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను శుక్రవారం కొట్టేసింది.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ గోవధకు సంబంధించిన పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో గోవధను సమూలంగా నిషేధించాలని, కబేళాలు ఎత్తేసేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను శుక్రవారం కొట్టేసింది.
సదరు వ్యాజ్యం విచారణకు ఏమాత్రం అర్హం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 'కొన్ని రాష్ట్రాలు గోవధను నిషేధించాయి. ఇంకొన్ని రాష్ట్రాలు అలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రాలు రూపొందించుకునే చట్టాలపై మేం జోక్యం చేసుకోలేం. దేశమంతటా గోవధను నిషేధించేలా ఆదేశాలు ఇవ్వలేం..' అని తేల్చి చెప్పింది.
గోవుల అక్రమ రవాణాపై ఇప్పటికే తాను మార్గదర్శకాలు ఇచ్ఛానన్న సుప్రీంకోర్టు... కొత్తగా సంపూర్ణ గోవధ నిషేధం పిటిషన్ పై విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది. మహారాష్ట్ర, హరియాణా, మధ్యప్రదేశ్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు గోవధను, గోమాంసాన్ని నిషేధించాయి.
ఈ నేపథ్యంలో.. దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా అదే విధానాన్ని అవలంభించాలని ఒక వర్గం నుంచి డిమాండ్ వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు వినీత్ సహాయ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ వేశారు.